Share News

టీడీపీ నాయకులపై పిడిగుద్దులు

ABN , Publish Date - Apr 19 , 2024 | 04:36 AM

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు దాడికి దిగారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ఎర్రనేల

టీడీపీ నాయకులపై పిడిగుద్దులు

ఎన్నికల ప్రచారంలో వైసీపీ వర్గీయుల కవ్వింపులు

వాహనం అడ్డు తీయమన్నందుకు దుర్భాషలు, దాడి

సొమ్మసిల్లిన కళ్యాణదుర్గం మున్సిపల్‌ మాజీ చైర్మన్‌

వాహనానికి టీడీపీ జెండా కట్టాడని చెప్పులతో దాడి

కళ్యాణదుర్గం, ఏప్రిల్‌ 18: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు దాడికి దిగారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ఎర్రనేల వీధిలో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు గురువారం ఉదయం ఇంటింటా ప్రచారాన్ని చేపట్టారు. అదే సమయంలో వైసీపీ నాయకులు ఓ వాహనంలో వచ్చి ప్రచారాన్ని అడ్డుకున్నారు. ఎంత నచ్చజెప్పినా వినకుండా దౌర్జన్యానికి దిగారు. అడ్డుగా ఉన్న వాహనాన్ని తియ్యమన్నందుకు నానా దుర్భాషలాడుతూ టీడీపీ వర్గీయులపై దాడికి దిగారు. పోలీసులు వచ్చినా వైసీపీ వర్గీయులు తగ్గలేదు. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వైపీ రమేశ్‌పై పిడిగుద్దులు కురిపించారు. సొమ్ముసిల్లి పడిపోయిన ఆయన్ను వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఓటమి భయంతోనే తమపై వైసీపీ నాయకులు దాడికి దిగారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న కళ్యాణదుర్గంలో అలజడి సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని కోరు తూ పట్టణ సీఐ హరినాథ్‌కు సురేంద్రబాబు అల్లుడు అవినాశ్‌ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

టీడీపీ కార్యకర్తపై దాష్టీకం

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పల్లె సింధూరారెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన బుక్కపట్నం మండలం పాముదుర్తి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వేణుగోపాలాచారి అనంతరం స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. బుచ్చయ్యగారిపల్లి సమీపానికి రాగానే అక్కడ ప్రచారం నిర్వహిస్తున్న అగ్రహారం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు లింగమయ్య, కిష్టప్ప ఆయన్ను అడ్డుకున్నారు. వేణుగోపాలాచారి తన ద్విచక్రవాహనానికి టీడీపీ జెండా కట్టుకోవడంతో నానా దుర్భాషలాడారు. వెంటనే జెండా తీసేయాలని బెదిరించారు. ఆయన ససేమిరా అనడంతో చెప్పులతో దాడిచేసి, రొమ్ముపై తీవ్రంగా కొట్టి గాయపరిచారు. వారినుంచి తప్పించుకున్న వేణుగోపాలాచారి.. బుక్కపట్నం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Updated Date - Apr 19 , 2024 | 04:36 AM