పిన్నెల్లికి ముందస్తు బెయిల్ పొడిగింపు
ABN , Publish Date - Jun 07 , 2024 | 01:59 AM
పోలింగ్ సందర్భంగా మే 13న పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్ ధ్వంసం, తదనంతరం జరిగిన ఘటనలు,

ఈవీఎం, దాడుల కేసుల విచారణ 13కి వాయిదా
హైకోర్టు ఆదేశాలు.. రోజంతా నరసరావుపేటలో టెన్షన్
అమరావతి, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): పోలింగ్ సందర్భంగా మే 13న పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్ ధ్వంసం, తదనంతరం జరిగిన ఘటనలు, మర్నాడు సీఐ నారాయణస్వామిపై దాడి చేసిన వ్యవహారంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్ను హైకోర్టు గురువారం పొడిగించింది. ఆయనపై నమోదైన కేసులకు సంబంధించిన విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్ను అప్పటివరకు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శేషగిరిరావు, ఇంకొందరు బాధితుల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. మధ్యంతర ఉత్తర్వులనుతో సంబంధం లేకుండా జూన్ 6న వ్యాజ్యాల పై విచారణ జరిపి తగిన నిర్ణయాన్ని వెల్లడించాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించిందని తెలిపారు. పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. పిన్నెల్లిని వేధించడంతో పాటు ఆయన ప్రతిష్ఠకు భంగం దెబ్బతీసేందుకు వరుస కేసులు నమోదు చేశారన్నారు. సమయాభావం వల్ల వ్యాజ్యాలపై లోతైన విచారణ ఇప్పటికిప్పుడు సాధ్యపడదని.. పోలీసులు వేసిన కౌంటర్ మధ్యాహ్నమే తనకు అందిందన్నారు. 6నే పిటిషన్లను పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వలేదని.. వచ్చే గురువారానికి వాయిదా వేయాలని కోరారు. అన్ని పక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల హింసాత్మక ఘటనల్లో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్ గడువు గురువారం ముగిసింది. దీంతో హైకోర్టు ఆదేశాలు రాగానే ఆయన్ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసేందుకు పోలీసులు నరసరావుపేటలో ఆయన ఉన్న నివాసం వద్ద భారీగా మోహరించారు. గురువారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో సంతకం చేసేందుకు వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన్ను అరెస్టు చేస్తారన్న ప్రచారం జరిగింది. రాత్రికి ముందస్తు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలివ్వడంతో అరెస్టు యత్నాలను పోలీసులు విరమించుకున్నారు.