అవినీతి ‘ద్వారం’ మూత
ABN , Publish Date - Nov 13 , 2024 | 05:42 AM
అది.. కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి చెందిన వీరభద్ర రొయ్యల ఎగుమతి ప్లాంట్..

అక్రమాల అడ్డాగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రొయ్యల ఫ్యాక్టరీ
రొయ్యల ఎగుమతి యూనిట్లో భారీ ఉల్లంఘనలు గుర్తింపు
వ్యర్థ జలాలు నేరుగా పంట కాలువలు, డ్రైనేజీల్లోకి విడుదల
కాలుష్య నివారణకు గ్రీన్ బెల్ట్ నిర్వహించాల్సి ఉన్నా బేఖాతరు
అక్రమాలు సరిదిద్దుకోవాలని గడువిచ్చినా లెక్కచేయని వైనం
దాంతో ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిపివేస్తూ పీసీబీ ఆదేశాలు
(కాకినాడ - ఆంధ్రజ్యోతి)
అది.. కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి చెందిన వీరభద్ర రొయ్యల ఎగుమతి ప్లాంట్.. గత ఐదేళ్లు అధికారాన్ని అడ్డంపెట్టుకుని నిబంధనలేమీ పాటించకుండా అడ్డగోలుగా వ్యవహరించారు. ఈ ఫ్యాక్టరీలో వెలువడే వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండానే పంటకాలవలు, డ్రైనేజీల్లోకి వదిలిపెట్టారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలేమీ ఖాతరు చేయకుండా.. చుట్టుపక్కల ప్రాంతాన్ని కాలుష్య కాసారంగా మార్చేశారు. అధికారులు కనీసం కన్నెత్తి చూడడానికే భయపడేలా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అడుగడుగునా అనేక ఉల్లంఘనలు గుర్తించిన అధికారులు వాటిని సరిదిద్దుకోవడానికి వ్యవధి ఇచ్చినా లెక్కచేయలేదు. దీంతో ఈ రొయ్యల ఫ్యాక్టరీపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉక్కుపాదం మోపింది. ఇష్టారాజ్యంగా నడుస్తున్న ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో ఏళ్లుగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ద్వారంపూడికి పెద్దషాక్ ఇచ్చింది.
అంతా మా ఇష్టం.. అడిగేదెవరు..
కాకినాడ జిల్లా కరప మండలం గురజనాపల్లిలో సర్వే నంబరు 116, 119బై 1, 2, 4, 8లో ద్వారంపూడి కుటుంబం వీరభద్ర రొయ్యల ఫ్యాక్టరీ నడుపుతోంది. సేకరించి తెచ్చిన రొయ్యలను ఇక్కడ ప్రాసెస్ చేసి ఎగుమతి చేస్తారు. ఈ కంపెనీలో వ్యర్థజలాల కాలుష్యం భారీగా ఉందని కొన్నేళ్లుగా స్థానికులు, రైతులు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోలేదు. వైసీపీ అధినేత జగన్కు ద్వారంపూడి అత్యంత సన్నిహితుడు కావడంతో అధికారులు ఈ కంపెనీపై కన్నెత్తి చూడలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంతో కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన కొందరు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జూలై 2న కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో పవన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్వారంపూడి రొయ్యల ఫ్యాక్టరీలో కాలుష్యం వెదజల్లుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తక్షణం అక్కడ వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేసి నివేదిక పంపాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా, విశాఖలోని కాలుష్య నియంత్రణ మండలి జోన్ అధికారులు జూలై 11న ఫ్యాక్టరీలో తనిఖీలు చేపట్టి పలు భారీ ఉల్లంఘనలు గుర్తించారు. 22న నివేదిక తయారు చేశారు.
గ్రీన్బెల్ట్ లేదు.. మురుగునీటి శుద్ధి లేదు..
ఈ నివేదిక ప్రకారం ఫ్యాక్టరీలో రొయ్యల శుద్ధి సమయంలో వెలువడే వ్యర్థజలాలను శుద్ధి చేయకుండా నేరుగా సమీప పంట కాలువలు, డ్రైన్లలోకి వదిలేస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) నిబంధనలు ఎక్కడా అమలు చేయకుండా పరిశ్రమ నడుపుతున్నారు. 13 ఎకరాల్లో పరిశ్రమకు సంబంధించి గ్రీన్బెల్ట్ నిర్వహించాల్సి ఉండగా అసలు అలాంటిదేమీ ఏర్పాటు చేయలేదు. వ్యర్థ జలాల శుద్ధీకరణకు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేయకుండా నేరుగా వాటిని డ్రెయిన్లు, పంట కాలువల్లో కలిపేస్తున్నారు. పీసీబీ వెబ్సైట్కు ఆన్లైన్ ద్వారా సమర్పించిన వివరాలన్నీ తప్పులతడకగా ఉన్నాయి. పీసీబీ అనుమతులు లేకుండా నాన్ ఐడీఆర్ బాయిలర్లు, ఐస్ప్లాంట్ నిర్వహిస్తున్నారు. ఈ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఆగస్టు 6న నోటీసులిచ్చారు. అయితే నవంబరు 8 నాటికి 14 ఎకరాలు కొనుగోలు చేసి గ్రీన్బెల్ట్ ఏర్పాటు చేస్తామని, అదనపు సామర్థ్యంతో కూడిన ఈటీపీ నిర్మిస్తామని పీసీబీని సదరు కంపెనీ గడువు కోరింది. కానీ.. ఆ కంపెనీ అవేమీ చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో ఈ ప్లాంట్ను పూర్తిగా మూసివేస్తూ అధికారులు ఆదేశాలు జారీచేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని లంపకలోవలో నిర్వహిస్తోన్న ద్వారంపూడికి చెందిన మరో రొయ్యల ఫ్యాక్టరీలోనూ భారీ ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.