Share News

వ్యయ పరిమితి దాటితే వేటు పడాల్సిందే!

ABN , Publish Date - Mar 24 , 2024 | 03:24 AM

ఎన్నికల కమిషన్‌ నిర్ధేశించిన వ్యయ పరిమితికి మించి అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చు చేస్తే వారిపై వేటు పడేలా కేంద్ర ఎన్నికల కమిషన్‌ సత్వర చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఎన్నికల వ్యయాల పూర్వ డైరెక్టర్‌ జనరల్‌ పీకే డాష్‌ పేర్కొన్నారు.

వ్యయ పరిమితి దాటితే వేటు పడాల్సిందే!

ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మార్చేశారు

సీఈసీ ఎన్నికల వ్యయాల పూర్వ డీజీపీకే డాష్‌ ధ్వజం

వలంటీర్లను పెన్షన్‌, రేషన్‌కు దూరంగా ఉంచాలి: నిమ్మగడ్డ

లోపభూయిష్టంగా ఓటర్ల జాబితా: వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి

విజయవాడ(గవర్నర్‌పేట), మార్చి 23: ఎన్నికల కమిషన్‌ నిర్ధేశించిన వ్యయ పరిమితికి మించి అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చు చేస్తే వారిపై వేటు పడేలా కేంద్ర ఎన్నికల కమిషన్‌ సత్వర చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఎన్నికల వ్యయాల పూర్వ డైరెక్టర్‌ జనరల్‌ పీకే డాష్‌ పేర్కొన్నారు. ‘స్వేచ్ఛాయుత ఎన్నికలు-అవినీతికి అడ్డుకట్ట’అనే అంశంపై సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సంస్థ ఆధ్వర్యాన శనివారం విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథి పీకే డాష్‌ మాట్లాడుతూ గతంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిర్ధేశించిన వ్యయ పరిమితి కన్నా అధికంగా ఖర్చు చేసినట్లు రుజువు కావడంతో ఎన్నికల్లో గెలిచిన మధుకోడా(జార్ఖండ్‌), అశోక్‌ చౌహాన్‌(మహారాష్ట్ర), నరోత్తం మిశ్రా(మధ్యప్రదేశ్‌), ఊర్మిళ జాదెబ్‌ల సభ్యత్వాలను రద్దు చేసినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌ పేర్కొన్న వ్యయానికి 100 రెట్లు ఖర్చు పెడుతున్నా ఏ ఒక్కరినీ తొలగించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల వ్యయాలపై సీలింగ్‌ లేకపోవడంతో ఎన్నికల బాండ్ల రూపంలో వేలాది కోట్ల రూపాయలు పొంది ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మారుస్తున్నారన్నారు.

సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సంస్థ కార్యదర్శి నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌ మాట్లాడుతూ ఏపీలో దాదాపు 3 లక్షల మంది వలంటీర్లు అధికార పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారని, వీరిపై కఠిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు వలంటీర్లను పెన్షన్‌, రేషన్‌ బియ్యం లాంటి పథకాలకు దూరంగా ఉంచాలన్నారు. ప్రధాని సభలో పోలీసుల వైఫల్యం కనిపించిందని, రాజకీయ ప్రత్యర్థుల హత్యలను పోలీసు యంత్రాంగం నివారించలేకపోయిందని ఆక్షేపించారు. వీటిని కేంద్ర ఎన్నికల కమిషన్‌ పరిశీలించాలని కోరారు. మండల, జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు ప్రవర్తనా నియమావళిని సక్రమంగా అమలు చేయాలన్నారు. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సంస్థ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ వలంటీర్లు, బూత్‌ లెవెల్‌ అధికారుల అక్రమాల ఫలితంగా ఓటర్ల జాబితా లోపభూయిష్టంగా మారిందన్నారు. అర్హత కలిగి ఓటు పొందని వారు ఏప్రిల్‌ 15 వరకు ఓటర్లుగా నమోదు అయ్యే అవకాశం ఉందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, పూర్వ మేయర్‌ డాక్టర్‌ జంధ్యాల శంకర్‌, ఆదాయపు పన్ను పూర్వ కమిషనర్‌ పి.రఘు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2024 | 03:24 AM