సర్కారు మారినా ‘రివర్సే’నా!?
ABN , Publish Date - Jul 31 , 2024 | 02:27 AM
రివర్స్ టెండరింగ్! అప్పటికే పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను మార్చి, అస్మదీయులకు పనులు అప్పగించి, కొత్తగా కమీషన్లు దండుకునేందుకు గత ప్రభుత్వం సరికొత్తగా తెచ్చిన విధానమిది! ఇందులో
అస్మదీయుల కోసమే నాడు రివర్స్ టెండర్లు
వేరేవారు బిడ్లు వేయకుండా బెదిరింపులు
రివర్స్ విధానాన్ని గట్టిగా వ్యతిరేకించిన టీడీపీ
సర్కారు మారింది.. కానీ, అదే తరహా ప్రక్రియ
చంద్రబాబు హయాంలో ఆన్లైన్ విధానం
రివర్స్లో రింగై ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
రివర్స్ టెండరింగ్! అప్పటికే పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను మార్చి, అస్మదీయులకు పనులు అప్పగించి, కొత్తగా కమీషన్లు దండుకునేందుకు గత ప్రభుత్వం సరికొత్తగా తెచ్చిన విధానమిది! ఇందులో ‘రింగు లీడర్లే’ చక్రం తిప్పారు. ఈ విధానాన్ని అప్పట్లో టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు... ప్రభుత్వం మారింది! అయినప్పటికీ రివర్స్ టెండరింగ్ పద్ధతే కొనసాగుతోంది. దీనిపై కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. తిరిగి పాత విధానాన్ని తీసుకురావాలని అభ్యర్థిస్తున్నారు.
ఇదీ నష్టం?
గతంలో ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా టెండర్లు పిలిచే వాళ్లు. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు. కాంట్రాక్టర్లు బిడ్లు కోట్ చేస్తారు. ఆ తర్వాత శాఖల అధికారులు బిడ్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లందరినీ ఆన్లైన్లోకి పిలుస్తారు. అందరికంటే తక్కువ (ఎల్1) ఎంతో చెప్పి... అంతకంటే తక్కువకు ఎవరైనా కోట్ చేస్తారా అని మిగిలిన కాంట్రాక్టర్లను అడుగుతారు. ఎవరైనా అందుకు ముందుకొస్తే వారికి టెండర్ కట్టబెడతారు. పైకి ఇదంతా పకడ్బందీగా జరుగుతున్నట్లు కనిపిస్తుంది. కానీ, కాంట్రాక్టర్లు అందరూ ముందే రింగ్ అవుతారు. టెండరు అప్పగించాలనుకున్న వ్యక్తికి అనుగుణంగా మిగిలిన వారు బిడ్డింగ్ వేస్తున్నారు. అన్నింటికీ మించి... తాము అధికారంలోకి వచ్చినప్పటికి జరుగుతున్న బడా కాంట్రాక్టర్లను బెదిరించేందుకు, గిట్టని వారిని పంపేసి సొంత సంస్థలకు పనులు అప్పగించేందుకే జగన్ సర్కారు ‘రివర్స్’ టెండరింగ్ను తీసుకొచ్చిందనే బలమైన ఆరోపణలున్నాయి.
బెదిరింపులు.. ఒత్తిళ్లు...
అంతకుముందు బిడ్ తెరిచిన తర్వాత ‘ఎల్1’గా ఎవరు ఉంటే వారికే కాంట్రాక్టు దక్కేది. కనిష్ఠంగా ‘కోట్’ చేసిన మొత్తం కూడా రహస్యమే. ఇక్కడ అలా కాదు. ఎల్1ను ఎవరో, కోట్ చేసింది ఎంతో చెప్పేసి... అంతకంటే తక్కువ కోట్ చేస్తారా అని అడుగుతారు. ‘రింగ్’లో భాగంగా ఒప్పందం ప్రకారం కాంట్రాక్టు ఇస్తారు. అలాకాదని ఎవరైనా పోటీకి వస్తే... బెదిరింపులూ, హెచ్చరికలే! బిడ్లు దాఖలు చేస్తే ఇబ్బందులు తప్పవని, వర్క్లు ఎలా చేస్తారో చూస్తామని హెచ్చరించేవారు. ఒకవేళ ఎక్కడైనా కాంట్రాక్టర్లు ధైర్యంగా బిడ్లు దాఖలు చేసినా అధికారులు బెదిరించేవారు. ఏదో ఒక అడ్డంకి కల్పించి, అర్హత లేదంటూ తప్పించేవాళ్లు! ఐదేళ్లూ ఇదే దందా సాగింది. ఇకనైనా కొత్త ప్రభుత్వం మళ్లీ ఆన్లైన్ టెండర్ల విధానాన్ని అమలు చేయాలని, రివర్స్ టెండరింగ్ను ఎత్తేయాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు.
దేవదాయ శాఖ
రెండు ఆలయాల నిర్మాణం కోసం దేవదాయ శాఖ అధికారులు ఇటీవల టెండర్లు ఆహ్వానించారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో ఈ ఆలయాలను ఏర్పాటుచేసేందుకు పిలిచిన టెండరులో కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారు. అందరూ కలిసిపోయి, ఎవరెక్కువ ముడుపులిస్తే ఆ కాంట్రాక్టర్కు టెండర్ దక్కేలా ఒప్పందం కుదిరిపోయిందని చెబుతున్నారు. దేవదాయ శాఖలో ప్రతి టెండరు కూడా ఇదే విధానంలో ఖరారు అవుతోందని చెబుతున్నారు.
నాకు బిడ్.. మీకు గిఫ్ట్
రాజమండ్రిలోని హోమియోపతి కాలేజీ నిర్మాణం పనుల కోసం నలుగురైదుగురు కాంట్రాక్టర్లు పోటీపడ్డారు. అందరూ కూర్చుని మాట్లాడుకున్నారు. మిగతావారితో ఒప్పందాలు పూర్తిచేసుకుని, ఒకరు టెండర్ దక్కిచుకున్నారు. ఒప్పందం ప్రకారం వారికి బహుమతులు సమకూర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవల్పమెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎ్సఐడీసీ) పరిధిలో ఈ వ్యవహారం నడిచింది. కార్పొరేషన్ పరిధిలో గత ఐదేళ్లు ప్రతి టెండర్లో ఇదే పద్ధతి సాగిందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
పాత పద్ధతే..
ఆన్లైన్ విధానం అందుబాటులో లేని పాత రోజుల్లో బాక్స్ టెండర్లు ఉండేవి. బాక్స్ టెండర్లు ఉన్నప్పుడు ఏం జరిగిందో... ఆ తర్వాత రివర్స్ టెండరింగ్లో అదే జరుగుతోంది. అప్పుడూ ఇలాగే కాంట్రాక్టర్లంతా ముందే కుమ్మక్కయ్యేవారు. టెండర్లు ఎవరు వేస్తున్నారనేది ముందు తెలుసుకుని, వారికి కొంత మొత్తం చెల్లించి టెండర్లు దాఖలు చేయకుండా చూసుకునేవారు. ఒకే కాంట్రాక్టర్ రెండు, మూడు కంపెనీల పేరుతో బిడ్లు దాఖలు చేసేవాడు. తనకు ఏ కంపెనీ పేరు మీద టెండర్ రావాలో దాని పేరుతో తక్కువ కోడ్ చేసేసి, టెండర్ దక్కించుకునేవారు. దీనివల్ల ప్రభుత్వానికి తీవ్ర నష్టం వచ్చేది. ఈ విషయాన్ని గుర్తించిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆన్లైన్ విధాన్ని తీసుకువచ్చింది. టెండర్ ప్రక్రియ నిజాయితీగా జరగాలని, అర్హత కలిగిన కాంట్రాక్టర్కు టెండర్ దక్కాలని ఈ విధానం తెచ్చారు. ఆ తర్వాత వచ్చిన గత వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండర్ తెచ్చి.. మళ్లీ ఆ పాత బాక్స్ పద్ధతినే ఐదేళ్లూ కొనసాగించింది.