నేడు టీడీపీలోకి ఏలూరు మేయర్
ABN , Publish Date - Aug 27 , 2024 | 04:11 AM
ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్, కోఆప్షన్ సభ్యుడు ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు మంగళవారం టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా
ఏలూరు టూటౌన్, ఆగస్టు 26: ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్, కోఆప్షన్ సభ్యుడు ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు మంగళవారం టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్ సమక్షంలో ఉండవల్లిలోని పార్టీ కార్యాలయంలో తెలుగుదేశంలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు నూర్జహాన్, పెదబాబు పార్టీ అధినేత జగన్కు లేఖ పంపారు. ఏలూరు కార్పొరేషన్లో మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉండగా వీరిలో 3 టీడీపీ, 47 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందే ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ప్రస్తుతం మేయర్ దంపతులతోపాటు మరో 30 మందికిపైగా కార్పొరేటర్లు టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదే జరిగితే పాలక మండలి టీడీపీ వశం కానుంది.