Share News

ఎల్లుండి టీడీపీలోకి మాగుంట

ABN , Publish Date - Mar 14 , 2024 | 04:29 AM

ఒంగోలు ఎంపీ, ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాగుంట శ్రీనివాసులరెడ్డి శనివారం (ఈనెల 16న) తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. తన కుమారుడు రాఘవరెడ్డి, అనుచరులతోపాటు ఆ రోజున సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారు.

ఎల్లుండి టీడీపీలోకి మాగుంట

ఉండవల్లిలో చంద్రబాబు సమక్షంలో చేరిక

‘అద్దంకి’ గరటయ్య, కృష్ణచైతన్య కూడా

ఒంగోలు మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు ఎంపీ, ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాగుంట శ్రీనివాసులరెడ్డి శనివారం (ఈనెల 16న) తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. తన కుమారుడు రాఘవరెడ్డి, అనుచరులతోపాటు ఆ రోజున సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారు. రాఘవరెడ్డికి ఇప్పటికే టీడీపీ లోక్‌సభ అభ్యర్థిత్వం ఖరారైందని అంటున్నారు. అలాగే ప్రకాశం జిల్లా సీనియర్‌ నాయకుడు, అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య, ఆయన తనయుడు, శాప్‌ నెట్‌ చైర్మన్‌ కృష్ణచైతన్య కూడా 16వ తేదీన ఉండవల్లిలో టీడీపీలో చేరనున్నారు. కృష్ణచైతన్య కూడా ఇటీవల వైసీపీ నుంచి బయటకు వచ్చారు. ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి 1991 నుంచి మాగుంట కుటుంబం పోటీ చేస్తూ ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తోంది. గత ఎన్నికల్లో మాగుంట వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందగా ఈ సారి వైసీపీ టికెట్‌ నిరాకరించారు. వ్యక్తిగతంగా కూడా మాగుంట పట్ల సీఎం జగన్‌ తీవ్ర అవమానకరంగా వ్యవహరించారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ నేపఽథ్యంలో గత నెల 28న మాగుంట వైసీపీకి రాజీనామా చేయడంతోపాటు ఈ సారి ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తాడని ప్రకటించారు.

Updated Date - Mar 14 , 2024 | 08:47 AM