తిరుమలపై ఎన్నికల ఎఫెక్ట్
ABN , Publish Date - Apr 25 , 2024 | 03:41 AM
వేసవి సెలవులైనప్పటికీ తిరుమలేశుడి దర్శనం గంటలోనే పూర్తవుతోంది.
గంటలోనే గోవిందుని దర్శనం.. వేసవి సెలవుల్లోనూ కనిపించని రద్దీ
తిరుమల, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): వేసవి సెలవులైనప్పటికీ తిరుమలేశుడి దర్శనం గంటలోనే పూర్తవుతోంది. సాధారణంగా వేసవి సెలవులు మొదలయ్యే మార్చి చివరి వారం నుంచి జూలై నెల చివరి వరకు తిరుమలలో రద్దీ అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత తిరుమల కిక్కిరిసి పోతుంటుంది. అయితే ఎన్నికల సీజన్ కావడంతో చాలామంది తిరుమల పర్యటన వాయిదా వేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడంతో కొంతమంది, ఎన్నికల సమయంలో ప్రయాణాలు ఎందుకని కొంతమంది వాయిదా వేసుకుంటున్న క్రమంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య 20 రోజులుగా తగ్గింది. గతేడాది ఏప్రిల్ 1 నుంచి 23వ తేదీ వరకు పరిశీలిస్తే దాదాపు 16,51,341 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 23వ తేదీ వరకు 15 లక్షల మంది భక్తులే శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేకించి వేసవి సెలవుల్లో శ్రీవారిని సగటున రోజుకు 70 నుంచి 80 వేల మంది దర్శించుకుంటారు. వారాంతాల్లో అయితే 90 వేల వరకు ఆ సంఖ్య పెరుగుతుంది. కానీ పదిరోజులుగా సగటున 60 వేలమంది మాత్రమే దర్శించుకున్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో 1.27 లక్షల మంది దర్శించుకోగా, గతేడాది 22, 23 తేదీల్లో 1.47 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం నుంచి శ్రీవారి దర్శనానికి క్యూకాంప్లెక్స్లోని షెడ్లలో నిలబడే అవసరం లేకుండా డైరెక్ట్ లైన్ నడుస్తోంది. సోమవారం పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చినప్పటికీ రద్దీ కనిపించడం లేదు. గంట నుంచి రెండు గంటల వ్యవధిలోనే స్వామి దర్శనం పూర్తవుతోంది. పోలింగు సమీపిస్తున్న క్రమంలో తిరుమలలో రద్దీ ఇంకా తగ్గే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.