కాంగ్రె్సలో ఎన్నికల సందడి
ABN , Publish Date - Mar 03 , 2024 | 02:56 AM
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలకు సర్వసన్నద్ధమవుతోంది. విజయవాడలోని ఆంధ్రరత్నభవన్లో శనివారం ఏపీసీసీ ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలరెడ్డి పలువురు ముఖ్యనేతలతో సమీక్షించారు.
7న అమరావతికి మద్దతుగా డీకే శివకుమార్ పర్యటన
11న విశాఖకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
అమరావతి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలకు సర్వసన్నద్ధమవుతోంది. విజయవాడలోని ఆంధ్రరత్నభవన్లో శనివారం ఏపీసీసీ ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలరెడ్డి పలువురు ముఖ్యనేతలతో సమీక్షించారు. ఈ సమీక్షలో పార్టీ సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, పల్లంరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమరావతి రాజధానికి మద్దతుగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మార్చి 7న గుంటూరు జిల్లాలో పర్యటిస్తారని, కాంగ్రెస్ ఇచ్చే గ్యారెంటీలను మార్చి 11న విశాఖలో జరిగే సభలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రకటిస్తారని తెలిపారు. త్వరలోనే వైసీపీకి చెందిన కొందరు ముఖ్యనేతలు కాంగ్రె్సలో చేరుతారని సంకేతాలు వస్తున్న తరుణంలో.. ఈ నెల ఐదో తేదీ వరకూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను నిలుపుదల చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు 1,351 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించిన మాణిక్కం ఠాగూర్, షర్మిలరెడ్డి.. కుల, జన, ఆర్థిక బలాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇదే సమయంలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పల్లంరాజు కాంగ్రెస్ తరఫున గ్యారెంటీలను ఇవ్వడంపై సమీక్షించారు. అభ్యర్థుల జాబితాపై తుది కసరత్తును స్ర్కీనింగ్ కమిటీ జాతీయ అధ్యక్షుడు మధుసూదన్ మిస్ర్తీ పూర్తిచేసి, అధిష్టానానికి నివేదిక ఇస్తారు.