వలంటీర్లను ఏజెంట్లుగా అనుమతించొద్దు
ABN , Publish Date - Apr 25 , 2024 | 03:56 AM
రాజీనామా చేసిన వలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించొద్దని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల విజ్ఞప్తి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): రాజీనామా చేసిన వలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించొద్దని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు. ఆ వలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా ఉంటే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులైన పేద ప్రజలు అధికార వైసీపీకి ఓటు వేసేలా ప్రభావితం చేయవచ్చన్నారు. ఈమేరకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్కు కనకమేడల ఫిర్యాదు చేశారు. వలంటీర్ల వ్యవస్థ వైసీపీ రాజకీయ ప్రయోజనాలను కాపాడేందుకు పనిచేస్తోందన్నారు. మరోవైపు పెన్షన్ లబ్ధిదారులకు మే నెల పెన్షన్ ఇంటి వద్దే ఇచ్చేవిధంగా రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు చేసేలా ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాసిన లేఖను కనకమేడల ఈసీకి అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను అడ్డుపెట్టుకొని పెన్షన్ దారులను జగన్ ప్రభుత్వం ఇబ్బందులు గురిచేసిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్లి అందించేవిధంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖ రాశారని తెలిపారు.