డీసీసీ బ్యాంకు టర్నోవ ర్ రూ.3 వేల కోట్లు
ABN , Publish Date - Jan 09 , 2024 | 11:28 PM
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) టర్నోవర్ 2023 డిసెంబరు నాటికి రూ.3 వేల కోట్లకు చేరిందని ఆ బ్యాంకు చైర్పర్సన్ ఎం.ఝాన్సీరాణి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం డీసీసీబీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
![డీసీసీ బ్యాంకు టర్నోవ ర్ రూ.3 వేల కోట్లు](https://media.andhrajyothy.com/media/2023/20231205/MBS_06_5fea36e9b3.gif)
కడప(రూరల్), జనవరి 9: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) టర్నోవర్ 2023 డిసెంబరు నాటికి రూ.3 వేల కోట్లకు చేరిందని ఆ బ్యాంకు చైర్పర్సన్ ఎం.ఝాన్సీరాణి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం డీసీసీబీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. 2021లో తాను డీసీసీబీ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టినప్పుడు బ్యాంకు టర్నోవర్ రూ.1300 కోట్లు ఉండేదని కేవలం రెండు సంవత్సరాలలోనే రూ.3వేల కోట్లకు తీసుకు వచ్చామన్నారు. రైతులతో పాటు డ్వాక్రా మహిళలకు, చిన్న వ్యాపారులకు, పాలు అమ్మకందారులకు, రైతులకు, వ్యవసాయ పనిముట్లకు, ట్రాక్టర్లకు, హార్వెస్టర్ల కొనుగోలుకు.. ఇలా అన్ని వర్గాల వారికి రుణాలు ఇస్తున్నామన్నారు. తాజాగా ఆర్బీఐ నుంచి కొత్త బ్రాంచ్లకు అనుమతి వచ్చిందన్నారు. త్వరలో ఎర్రగుంట్ల, ముద్దనూరు, రామేశ్వరం, బి.మఠంలో బ్రాంచ్లను ఏర్పాటు చేస్తామన్నారు. సొసైటీలను కూడా లాభాల బాటలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజాప్రతినిధులు కూడా వారి పేరుమీద, వారి పిల్లల పేరున బ్యాంకులో డిపాజిట్ చేసి ప్రజల్లో బ్యాంకుపట్ల మరింత నమ్మకం కలిగించాలన్నారు. డీసీసీబీ సీఈవో రాజేంద్రకుమార్ మాట్లాడుతూ తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లిస్తే తక్కువ వడ్డీ పడుతుందన్నారు. అనంతరం డీసీసీబీ రూ.3వేల కోట్లు టర్నోవర్ సాధించిన సందర్భంగా డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగుల సమక్షంలో కేక్ను కట్చేసి ఆనందాన్ని పంచుకున్నారు.