సీఎస్, డీజీపీని తొలగించాలి
ABN , Publish Date - Apr 19 , 2024 | 04:39 AM
‘రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)తోపాటు డీజీపీ, నిఘా సంస్థల అధినేతలను విధుల నుంచి తప్పించాలి’ అని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ డిమాండ్ చేశారు.
నిఘా సంస్థల అధినేతను కూడా...
అప్పుడే రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు
గులకరాయి కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వకూడదు?: లంకా దినకర్
రాజమహేంద్రవరం అర్బన్, ఏప్రిల్ 18: ‘రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)తోపాటు డీజీపీ, నిఘా సంస్థల అధినేతలను విధుల నుంచి తప్పించాలి’ అని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జల్లా రాజమహేంద్రవరంలోని బీజేపీ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘విధులు సక్రమంగా నిర్వర్తించని, జగన్కు తొత్తులుగా మారిన అధికారులను తొలగిస్తేనే రాష్ట్రంలో ఎన్నికలు సక్రమంగా జరుగుతాయి. అక్రమాల కోసం వైసీపీ దాచిన మద్యం డంపులు, డబ్బుల మూటలు బయటకు వస్తాయి. గులకరాయి కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వకూడదు? 33 మంది వృద్ధ పింఛనుదారుల మరణాలు ప్రభుత్వ హత్యలే. ఇందుకు సీఎస్ లోపభూయిష్టమైన నిర్ణయాలే కారణం. ఎన్నికల కమిషన్ తొలగించిన అధికారుల స్థానంలో మరలా జగన్మోహన్రెడ్డి చెప్పిన అధికారులను సీఎస్ నియమిస్తూ కేంద్రానికి జాబితాలు పంపడంపై ఈసీ దృష్టి సారించాలి. జగన్ 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ మొహం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారు’ అని దినకర్ ప్రశ్నించారు.