తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ABN , Publish Date - May 26 , 2024 | 01:45 AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్ కృష్ణతేజ గెస్ట్హౌస్ మీదుగా రింగ్ రోడ్డులో శిలాతోరణం సర్కిల్ వరకూ వ్యాపించింది.
![తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ](https://media.andhrajyothy.com/media/2024/20240511/qq_f2fd0a6503.jpg)
శిలాతోరణం సర్కిల్ వరకు ఉచిత బస్సులు
తిరుమల, మే 25(ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్ కృష్ణతేజ గెస్ట్హౌస్ మీదుగా రింగ్ రోడ్డులో శిలాతోరణం సర్కిల్ వరకూ వ్యాపించింది. వీరికి 20 గంటల దర్శన సమయం పడుతున్నట్టు టీటీడీ ప్రకటించింది. కాగా.. శనివారం తెల్లవారుజామున ఉచిత దర్శన టోకెన్ల కోసం తిరుపతిలో భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు. శ్రీనివాసం, విష్ణునివాసం వద్ద రాత్రి 2గంటల నుంచే భారీ క్యూలైన్లు దర్శనమిచ్చాయి. కాగా.. తిరుమలలోని అక్టోపస్ భవనం వద్దనున్న సర్కిల్ నుంచి శిలాతోరణం సర్కిల్ వరకు శ్రీవారి భక్తులను ఉచిత బస్సుల్లో చేరుస్తున్నారు. క్యూలైన్ పొడవు అధికంగా ఉన్న నేపథ్యంలో భక్తులు నడిచే అవసరం లేకుండా ప్రత్యేకంగా ఎనిమిది ఉచిత బస్సులను ఏర్పాటు చేసి భక్తులను తరలిస్తున్నారు. గడిచిన 10 రోజుల్లో శ్రీవారిమెట్టు, అలిపిరి నడకమార్గాల్లో దాదాపు 2.60 లక్షల మంది భక్తులు తిరుమలకు చేరుకున్నట్టు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.