Share News

సీఎస్‌, డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌లపై ఫిర్యాదులు

ABN , Publish Date - Apr 19 , 2024 | 04:10 AM

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌), డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ తదితర ఉన్నతాధికారులపై ఫిర్యాదులు అందాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. ఈసీ ఆదేశాల మేరకు వారినుంచి వివరణ తీసుకుని పంపినట్టు

సీఎస్‌, డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌లపై ఫిర్యాదులు

వారి నుంచి వివరణ తీసుకున్నాం

ఈసీ ఆదేశాల కోసం చూస్తున్నాం

ఎన్నికలపై కమిషన్‌ ప్రత్యేక దృష్టి

సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా

కోడ్‌ దాటిన అజేయ కల్లం

ప్రభుత్వ సలహాదారుగా ఉండి

ఓ సమావేశంలో జగన్‌పై పొగడ్తలు

గత టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు

అమరావతి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌), డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ తదితర ఉన్నతాధికారులపై ఫిర్యాదులు అందాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. ఈసీ ఆదేశాల మేరకు వారినుంచి వివరణ తీసుకుని పంపినట్టు వివరించారు. ఈ అంశంపై ఈసీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. మంత్రులకు వర్తించినట్లుగానే సలహాదారులకు కూడా కోడ్‌ వర్తిస్తుందన్నారు. గురువారం ఉదయం 11గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైందన్నారు. 6 అసెంబ్లీ స్థానాలు మినహా మిగిలినచోట్ల ఉదయం 7నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో రెండు కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందన్నారు. గురువారం సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు 44,163 మంది వలంటీర్లు రాజీనామా చేశారని, 1,017 మందిని విధుల నుంచి తప్పించామని తెలిపారు. ఇప్పటి వరకు రూ.180 కోట్ల నగదు, ఇతర వస్తువులను సీజ్‌ చేశామన్నారు. రాష్ట్రంలోని 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో సీఈవో మీనా లోక్‌సభ, శాసనసభలకు విడివిడిగా గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. లోక్‌సభ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే వారు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్‌ పత్రాలు సమర్పించాలన్నారు. లోక్‌సభ అభ్యర్థి రూ.25వేలు, శాసనసభ అభ్యర్థి రూ.10వేలు ధరావతు చెల్సించాల్సి ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50 శాతం చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు.

మీనా చెప్పిన మరిన్ని అంశాలు..

+ అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఉదయం 7నుంచి సాయంత్రం 4గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరులో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ జరుగుతుంది. మిగిలిన చోట్ల ఉదయం 7- 6 గంటల వరకు కొనసాగుతుంది.

+ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, వీడియోగ్రాఫర్లు, డ్రైవర్లు మే 5నుంచి 10లోపు ఫెసిలిటేషన్‌ సెంటర్లలోనే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.

+ రాష్ట్రంలోని 67వేల మంది సర్వీస్‌ ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోవచ్చు. 3.3 లక్షల మంది పోలింగ్‌ విధుల్లో ఉంటారు. 300 కంపెనీల బలగాలు రానున్నాయి. రాష్ట్రంలో 12,459 అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటితో కలిపి 30,111 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారు. ఆ కేంద్రాల్లో రెండు కెమేరాలతో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేస్తారు.

+ కోడ్‌ ఉల్లంఘనలకు సంబంధించి వైసీపీకి చెందిన 136, టీడీపీకి చెందిన 126 మంది సహా ఇతరులపై 76 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

Updated Date - Apr 19 , 2024 | 04:10 AM