చిత్తూరులో సీఎంసీ మెడికల్ కాలేజీ
ABN , Publish Date - Oct 10 , 2024 | 04:02 AM
చిత్తూరులో మెడికల్ కాలేజీ, టీచింగ్ హాస్పిటల్ నిర్మించేందుకు దేశంలోనే ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ(సీఎంసీ) సిద్ధమైంది.
500 కోట్లతో ఏర్పాటు నిర్మాణానికి అజీమ్
ప్రేమ్జీ ఫౌండేషన్ నిధులు
ఇప్పటికే ఉన్న సీఎంసీ ఆసుపత్రి విస్తరణ
వేలూరు, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): చిత్తూరులో మెడికల్ కాలేజీ, టీచింగ్ హాస్పిటల్ నిర్మించేందుకు దేశంలోనే ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ(సీఎంసీ) సిద్ధమైంది. దీనికి అవసరమయ్యే రూ.500 కోట్ల మొత్తాన్ని ‘అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్’ సమకూర్చేందుకు ముందుకువచ్చింది. ఈ మేరకు బుధవారం ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా సీఎంసీ డైరెక్టర్ డాక్టర్ విక్రమ్ మాథ్యూస్, అజీమ్ ప్రేమ్జీ షౌండేషన్ సీఈవో అనురాగ్ బెహర్, సీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సోలమన్ సతీశ్కుమార్ తదితరులు మాట్లాడుతూ... ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి ఆరోగ్య సంరక్షణ, వైద్యవిద్యను అందించేందుకు అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ముందుకు వచ్చినట్లు వివరించారు. ఒప్పందంలో భాగంగా మెడికల్ కాలేజీ ఏర్పాటుతో పాటు ఇప్పటికే ఉన్న 120 పడకల సీఎంసీ ఆసుపత్రిని 422 పడకలతో బోధనాసుపత్రిగా అప్గ్రేడ్ చేయడానికి రూ.500 కోట్లను సమకూర్చనుందని తెలిపారు. చిత్తూరు క్యాంప్సలో కొత్త మెడికల్ కాలేజీ, టీచింగ్ హాస్పిటల్ నిర్మాణం ద్వారా వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణ, పరిశోధన వంటివి అందించాలనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు. చిత్తూరులోని తమ ప్రాంగణంలో ఐదేళ్ల క్రితం అలైడ్ హెల్త్ సైన్స్, కాలేజీ ఆఫ్ నర్సింగ్ కోర్సులను ప్రారంభించినట్టు తెలిపారు. కాగా, సీఎంసీ అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన 3,675 పడకల మల్టీ స్పెషాలిటీ హెల్త్కేర్ సంస్థ. దేశంలోనే అగ్రశ్రేణి విద్య, ఆరోగ్య సంరక్షణ, పరిశోధనా సంస్థగా పేరొందింది. సీఎంసీ ప్రాథమిక, మాధ్యమిక, తృతీయ, క్వార్టర్నరీ కేర్ ఆసుపత్రులు తమిళనాడులోని వేలూరుతో పాటు రాణిపేట, చిత్తూరు జిల్లాల్లో ఉన్నాయి. సీఎంసీ ద్వారా ఏడాదికి 32 లక్షల మందికి పైగా సేవలందుతున్నాయి. సీఎంసీలో దాదాపు 229 కోర్సులను నేర్పిస్తున్నారు. వీటి ద్వారా ఏటా 2 వేల మంది విద్యార్థులకు మేలు జరుగుతుండడం గమనార్హం.