Share News

అభ్యర్థిని మార్చండి: తిరుపతి జనసైనికుల డిమాండ్‌

ABN , Publish Date - Mar 18 , 2024 | 03:31 AM

తిరుపతి అసెంబ్లీ స్థానానికి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న ఆరణి శ్రీనివాసులును మార్చాలని జనసేన పార్టీ స్థానిక నాయకులు డిమాండ్‌ చేశారు.

అభ్యర్థిని మార్చండి: తిరుపతి జనసైనికుల డిమాండ్‌

అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): తిరుపతి అసెంబ్లీ స్థానానికి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న ఆరణి శ్రీనివాసులును మార్చాలని జనసేన పార్టీ స్థానిక నాయకులు డిమాండ్‌ చేశారు. జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి తిరుపతికి వెళ్లిన అజయ్‌కుమార్‌.. ఆదివారం స్థానిక జనసేన నాయకులతో భేటీ అయ్యారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని, ఆయనతో కలిసి పని చేయాలని కోరారు. ఆయన విన్నపాన్ని స్థానిక నాయకులు అంగీకరించలేదు. తిరుపతిలో ఉన్న వాస్తవ పరిస్థితులను వివరించారు. తిరుపతి కచ్చితంగా గెలిచే స్థానమని, ఇలాంటి అభ్యర్థిని నిలబెట్టడం వల్ల సీటు కోల్పోయే ప్రమాదం ఉందని వివరించారు. ఈ విషయాన్ని అధినేత పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లాలని, అవసరమైతే తాము కూడా ఆయన్ని కలిసి వివరిస్తామని అజయ్‌కుమార్‌కు తెలియజేశారు. వారి అభ్యంతరాలను గుర్తించిన ఆయన అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. భేటీలో తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, తిరుపతి అర్బన్‌ అధ్యక్షుడు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2024 | 03:31 AM