నేడు తిరుమలకు చంద్రబాబు
ABN , Publish Date - Jun 12 , 2024 | 03:06 AM
టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీవారి దర్శనార్థం బుధవారం తిరుమలకు రానున్నారు. ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు చేరుకుంటారు.
సీఎం హోదాలో రేపు ఉదయం శ్రీవారి దర్శనం
తిరుమల, అమరావతి, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీవారి దర్శనార్థం బుధవారం తిరుమలకు రానున్నారు. ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు చేరుకుంటారు. బుధవారం రాత్రి తిరుమలలోని గాయత్రి నిలయం అతిథిగృహంలో బస చేస్తారు. గురువారం ఉదయం 7.30 గంటలకు సీఎం హోదాలో కుటుంబసమేతంగా వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకుంటారు. అనంతరం రంగనాయక మండపంలో వేదపండితుల ఆశీర్వచనం అందుకుంటారు. తిరిగి 8.20 గంటలకు అతిథిగృహానికి చేరుకుని 9 గంటలకు తిరుమల నుంచి అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు. చంద్రబాబు సీఎం హోదాలో తిరుమలకు వస్తున్న నేపథ్యంలో టీటీడీ అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అతిథిగృహం వద్ద స్వాగతం, బస, దర్శన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేసింది. మరోవైపు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసు, టీటీడీ విజిలెన్స్ విభాగాలు కూడా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశాయి. చంద్రబాబు బస చేసే అతిథిగృహం, కాన్వాయ్ ప్రయాణించే మార్గాల్లో డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేశాయి.