Share News

AP Election 2024: వైసీపీపై మూకుమ్మడి దాడి చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

ABN , Publish Date - Apr 17 , 2024 | 07:28 PM

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024లో విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్న టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. పెడనలో జరిగిన రోడ్ షో అనంతరం బహిరంగ సభలో ఇద్దరూ మాట్లాడారు. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని జనసేనాని పవన్‌ వ్యాఖ్యానించారు. ఓట్లు చీలకుండా ఉండేందుకే పొత్తులకు వెళ్లామని ఆయన పునరుద్ఘాటించారు.

AP Election 2024: వైసీపీపై మూకుమ్మడి దాడి చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

పెడన: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024లో విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్న టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. పెడనలో జరిగిన రోడ్ షో అనంతరం బహిరంగ సభలో ఇద్దరూ మాట్లాడారు. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని జనసేనాని పవన్‌ వ్యాఖ్యానించారు. ఓట్లు చీలకుండా ఉండేందుకే పొత్తులకు వెళ్లామని ఆయన పునరుద్ఘాటించారు. వైసీపీ అవినీతి, రాక్షస పాలనను తరిమికొట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. అందరూ కలిసి పనిచేయాలని, ప్రజల్లోకి వెళ్లాలని జనసేన, టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏపీ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని, రాష్ట్రంలో త్వరలో రామరాజ్యం స్థాపిద్దామని పిలుపునిచ్చారు.


వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది: చంద్రబాబు

వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ నేతలపై కుట్రలకు పాల్పడుతున్నారని, సీఎంపై గులకరాయి ఘటనలో వైసీపీ నీచమైన డ్రామాలతో అభాసుపాలైందని ధ్వజమెత్తారు. ఈ కేసులో బోండా ఉమను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు హెచ్చరించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నా కొద్దీ అధికార పార్టీ కుట్రలను మరింత పెంచుతోందని విమర్శించారు. హత్యాయత్నం అంటూ టీడీపీపై బురద వేయాలని చూశారని, వైసీపీ కుతంత్రాలను పసిగట్టి ప్రజలు ఛీకొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లే నిందితులు అంటూ వడ్డెర కాలనీకి చెందిన యువకులు, మైనర్లను పోలీసులు తీసుకుపోయారని అన్నారు. దీంతో బాధిత వడ్డెర కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయన్నారు.


అసలు రాయి విసిరింది ఎవరు.. కారణాలేంటో చెప్పకుండా.. మళ్లీ కుట్రలకు నీచపు ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీపై చంద్రబాబు మండిపడ్డారు. అధికార దుర్వినియోగంపై ఈసీ దృష్టి పెట్టాలని, టీడీపీపై నింద వేయడానికి పోలీసులతో తప్పులు చేయిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థులు, ముఖ్యనేతలను కేసుల్లో ఇరికించేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. నిందితులతో టీడీపీకి సంబంధాలున్నట్లు చిత్రీకరించేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ప్రలోభాలు, ఒత్తిళ్లకు లోనై తప్పుడు కేసులు పెట్టినా, తప్పు చేసినా జూన్ 4 తర్వాత ఏర్పడే కూటమి ప్రభుత్వంలో కఠినంగా శిక్షిస్తామని చంద్రబాబు హెచ్చరించారు.

Updated Date - Apr 17 , 2024 | 07:28 PM