పాడైన వ్యవస్థను సరిచేయగలిగేది చంద్రబాబే
ABN , Publish Date - Apr 24 , 2024 | 03:12 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో పాడైపోయిన వ్యవస్థలను సరిచేయగలిగే నాయకుడు చంద్రబాబేనని ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు.
కోస్తాలో విజయం రాయలసీమలోనూ రావాలి: రఘురామ
రేణిగుంట/తిరుపతి, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో పాడైపోయిన వ్యవస్థలను సరిచేయగలిగే నాయకుడు చంద్రబాబేనని ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు. నామినేషన్ వేసిన సందర్భంగా శ్రీవారి దర్శనార్థం మంగళవారం సాయంత్రం ఆయన తిరుపతి వచ్చారు. ఈ సందర్భంగా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నానీ ఇంటి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా ఎవరి ఆస్తి వాళ్ల దగ్గర ఉంటుందనే నమ్మకం లేదన్నారు. లిటిగేషన్ పెట్టి బలవంతులైన వాళ్లే తీసుకోవచ్చన్నారు. దీనిపై కోర్టుకు వెళ్లాలంటే జీవితకాలం సరిపోదన్నారు. ‘రాజకీయంగా నెలరోజులుగా విపరీతమైన ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఎవడైతే నాకు సీటు రాకుండా ప్రభావితం చేయగలిగాడో వాడి ముందు, వాడి అనుచరుల ముందు తలెత్తుకునేలా చేసింది చంద్రబాబే. ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని రఘురామ అన్నారు. చంద్రబాబు భారీ మెజార్టీతో గెలవాలని స్వామిని కోరుకోవడం కోసం తిరుమలకు వచ్చానన్నారు. కోస్తాలో కూటమికి ఉన్న విజయం రాయలసీమలోనూ రావాలన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని రఘురామ చెప్పారు.