నరసరావుపేటలో వలంటీర్లకునగదు పంపిణీ
ABN , Publish Date - Mar 04 , 2024 | 03:30 AM
పల్నాడు జిల్లాలో బహిరంగంగానే ఎన్నికల తాయిలాల పంపిణీకి వైసీపీ ఎమ్మెల్యేలు బరితెగించారు.
ఒక్కొక్కరికీ కవర్లో రూ.5 వేలు
ఉదయం కవర్లపై ఎమ్మెల్యే స్టాంప్.. రాత్రికిచ్చినవాటిపై మాత్రం మాయం
పెదకూరపాడు, వినుకొండల్లోయథేచ్ఛగా చీరెలు, కుక్కర్ల పంపిణీ
పల్నాడులో వైసీపీ ఎమ్మెల్యేల ప్రలోభపర్వం
ఈసీ పట్టించుకోవడం లేదని విపక్షాల ఆగ్రహం
నరసరావుపేట, మార్చి 3: పల్నాడు జిల్లాలో బహిరంగంగానే ఎన్నికల తాయిలాల పంపిణీకి వైసీపీ ఎమ్మెల్యేలు బరితెగించారు. కొద్దిరోజుల కిందట పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓటర్లకు చీరెలు, కుక్కర్లు మొదలైనవి పంపిణీ చేశారు. ఇప్పుడు నగదు పంపిణీకి శ్రీకారం చుట్టారు. నరసరావుపేటలో ఆదివారం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఒక్కో వలంటీరుకు రూ.5 వేల నగదు కవర్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఉదయం కవర్లపై ఎమ్యెల్యే స్టాంప్ ఉండగా, రాత్రికి ఇచ్చిన కవర్లపై స్టాంప్ లేదని వారు చెబుతున్నారు. ఈ భేటీలో ఎన్నికల్లో వైసీపీ కోసం ఎలా పని చేయాలో ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే వలంటీర్లు ఉండరని.. అందుచేత వైసీపీని మళ్లీ గద్దెనెక్కించేందుకు వారు కృషి చేయాలని, అలాగే సంక్షేమ పథకాలను పొందుతున్న లబ్ధిదారులను ప్రభావితం చేసేలా పనిచేయాలని ఆయన సూచించినట్లు పలువురు వలంటీర్లు తెలిపారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే సంక్షేమ పఽథకాలు ఉండవంటూ ఓటర్లకు తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని ఎమ్మెల్యే వలంటీర్లపై ఒత్తిడి తెస్తునట్లు తెలిసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే వార్డుల్లోని నేతలతో టచ్లో ఉండాలని ఆదేశించారని అంటున్నారు. బాహాటంగానే ప్రలోభాల పర్వం కొనసాగిస్తున్నా ఎన్నికల సంఘం (ఈసీ) పట్టించుకోవడంలేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.