ఈ దశలో జోక్యం చేసుకోలేం..
ABN , Publish Date - Oct 05 , 2024 | 03:47 AM
నూతన మద్యం పాలసీలో భాగంగా గీతకార్మికులకు రిజర్వ్ చేసిన షాపులను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో ముందే ప్రకటించేలా ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశా లూ ఇవ్వలేమని హైకోర్టు తేల్చిచెప్పింది.
గీతకార్మికుల షాపులపైప్రభుత్వాన్ని ఆదేశించలేం: హైకోర్టు
అమరావతి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): నూతన మద్యం పాలసీలో భాగంగా గీతకార్మికులకు రిజర్వ్ చేసిన షాపులను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో ముందే ప్రకటించేలా ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశా లూ ఇవ్వలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రభుత్వ విధాన నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. గీత కార్మికుల షాపులపై వేసిన అనుబం ధ పిటిషన్ను కొట్టివేసింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. గీత కార్మికుల షాపులను ప్రకటించకుండా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఉమ్మడి కృష్ణా జిల్లా ఘంటసాల మండలం, కొడాలి గ్రామానికి చెందిన పరుచూరి శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది మనోహర్రెడ్డి, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మరోవైపు మండలాన్ని ఓ యునిట్గా తీసుకొని రిటైల్ ఎక్సైజ్ శ్లాబు నిర్ణయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 211, 212లను సవాల్ చేస్తూ కోనసీమ జిల్లా, కొత్తపేట కు చెందిన కొప్పుల వీర వెంకట సత్యనారాయణ మూర్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. మద్యం షాపు లకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్తో పాటు లైసెన్స్లు జారీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. ప్రధాన వ్యాజ్యంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.