Share News

వచ్చే నెల నుంచి క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ ప్రోగ్రామ్‌

ABN , Publish Date - Jul 28 , 2024 | 03:15 AM

క్యాన్సర్‌ వ్యాధిని సకాలంలో గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పేర్కొన్నారు.

వచ్చే నెల నుంచి క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ ప్రోగ్రామ్‌

వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు

విశాఖపట్నం, జూలై 27 (ఆంధ్రజ్యోతి): క్యాన్సర్‌ వ్యాధిని సకాలంలో గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పేర్కొన్నారు. నేషనల్‌ క్యాన్సర్‌ గ్రిడ్‌ రెండో వార్షిక సదస్సును శనివారం విశాఖపట్నం ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ క్యాన్సర్‌ను సకాలంలో గుర్తించి, వైద్యం అందించడం కీలకమన్నారు. ఆగస్టు నుంచి రాష్ట్రంలో క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తున్నామని, ఇంటింటికీ వెళ్లి ఓరల్‌, సర్వైకల్‌, రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించి స్ర్కీనింగ్‌ నిర్వహించనున్నారన్నారు. తద్వారా సకాలంలో వ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తించి వైద్య సేవలు అందించేందుకు వీలవుతుందన్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని 16 మెడికల్‌ కాలేజీల్లో అంకాలజీ విభాగాలను ఏర్పాటుచేశామని, వాటిని మరింత బలోపేతం చేస్తున్నామన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 07:41 AM