విమానం రద్దు.. మీ చావు మీరు చావండి!
ABN , Publish Date - Jul 16 , 2024 | 03:56 AM
ప్రయాణికుల నుంచి ముక్కుపిండి మరీ చార్జీలు వసూలు చేస్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ ప్రయాణికుల అవసరాలను గుర్తించటంలో విఫలమవుతోంది.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని ఇండిగో సంస్థ
ముంబై ప్రయాణికులకు తీవ్ర కష్టాలు
విదేశాలకు వెళ్లాల్సినవారికి మరిన్ని ఇబ్బందులు
సంస్థ తీరుపై చాలా కాలంగా ఫిర్యాదులు
విజయవాడ, జూలై 15((ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల నుంచి ముక్కుపిండి మరీ చార్జీలు వసూలు చేస్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ ప్రయాణికుల అవసరాలను గుర్తించటంలో విఫలమవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి విమాన సర్వీసు విషయంలో సాంకేతిక లోపాలు తలెత్తిన నేపథ్యంలో, ఆదివారం విమానయాన సంస్థ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. విమానాలకు సాంకేతిక సమస్యలు ఏర్పడితే ఏ విమానయాన సంస్థ అయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతుంది. ఇండిగో సంస్థ మాత్రం ఏకంగా విమాన సర్వీసును రద్దు చేసి, ప్రయాణికులకు ప్రత్యామ్నాయం సంగతిని గాలికొదిలేసింది. గత కొంతకాలంగా ఇండిగో సిబ్బంది తీరు పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రయాణికులతో ఫ్రెండ్లీగా ఉండటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. తాజాగా ఆదివారం ఇండిగో వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ముంబైకి విమాన సర్వీసు రద్దు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మన దేశం నుంచి ప్రపంచ దేశాలకు వెళ్లే డెస్టినేషన్ విమానాశ్రయాలలో ముంబై, ఢిల్లీ విమానాశ్రయాలు ఉన్నాయి. ముంబైకి విమాన సర్వీసు బుక్ చేసుకున్నవారిలో దాదాపు సగంమంది అక్కడి నుంచి విదేశాలకు వెళ్లేవారుంటారు. ముంబై సర్వీసు రద్దయితే విదేశాలకు వెళ్లే విమానాన్ని అందుకోలేని పరిస్థితి నెలకొంటుంది. ఆదివారం ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానం రద్దు కావటంతో.. ముంబై నుంచి అమెరికా, ఆస్ర్టేలియా, ఇంగ్లాండ్ తదితర దేశాలకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్థికంగానూ నష్టపోయారు. ముంబైకి వ్యాపార పనుల నిమిత్త ం వె ళ్లాల్సిన వారు, అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారు కూడా ఇబ్బందులకు గురయ్యారు. ‘మా విమానం రద్దయింది.. మీ చావు మీరు చావండి!’ అన్న చందాన వ్యవహరించటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇప్పటికైనా ఇండిగో యాజమాన్యం తమ విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది.