Share News

పట్టపగలే రెండు ఇళ్లల్లో చోరీ

ABN , Publish Date - May 26 , 2024 | 11:31 PM

పట్ట పగలే రెండు ఇళ్లల్లో చోరీ చేసి 550 గ్రాముల బంగారు, 2 కేజీల వెండి, రూ.1.60 లక్షల నగదును దొంగలు దోచుకెళ్లిన సంఘటన పట్టణంలో చోటుచేసుకుంది.

పట్టపగలే రెండు ఇళ్లల్లో చోరీ
ఫింగర్‌ ప్రింట్స్‌ సేకరిస్తున్న క్లూస్‌టీం సిబ్బంది

550 గ్రాముల బంగారు, 2 కేజీల వెండి, రూ1.60 లక్షల నగదు

మదనపల్లె అర్బన్‌, మే 26: పట్ట పగలే రెండు ఇళ్లల్లో చోరీ చేసి 550 గ్రాముల బంగారు, 2 కేజీల వెండి, రూ.1.60 లక్షల నగదును దొంగలు దోచుకెళ్లిన సంఘటన పట్టణంలో చోటుచేసుకుంది. వన్‌ టౌన్‌ సీఐ వల్లిబసు వివరాల మేరకు.. నీరుగట్టువారిపల్లె, రామి రెడ్డి లేవుట్‌కు చెందిన బి.చంద్ర శేఖర్‌ ఇంట్లో ఆదివారం ఎవ్వరూ లేని సమయం చూసి తలుపులు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. స్థానిక నీరుగట్టువారిపల్లెలోని రాజానగర్‌లో తన మామ మృతిచెందిన కారణంగా కుటుంబసభ్యులతో కలిసి అక్కడికి వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా అప్పటికే బీరువాల్లోని దుస్తులు చిందర వందరగా పడి ఉండడం గమనించారు. 500 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి, ఒకటిన్నర లక్ష నగదును అపహరించుకు పోయినట్లు గుర్తించారు.

అదేవిధంగా నీరుగట్టువారిపల్లెలోని కాట్లాటపల్లె రోడ్డులోని ఓబుల్‌ రెడ్డి, శాంతమ్మ ఇంట్లో కూడా దొంగలు పడి 50 గ్రాముల బంగారం, రూ.10 వేలు నగదు దొచుకెళ్లినట్లు తెలిపారు. ఓబుల్‌రెడ్డి పెద్దమండ్యెం మండలం, కలి చెర్లలో బంధువుల ఇంట్లో జాతరకు వెళ్లగా, శాంతమ్మ కోళ్లబైలు పంచాయతీలో మామిడిగుంపలపల్లెలో తమకు ఉన్న పొలంలో పనులకు వెళ్లింది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి తాళాలను పగలగొట్టి చోరీ చేసినట్లు తెలిపారు. మూడు గంటల సమయంలో ఇంటికి వచ్చిన శాంతమ్మ ఆందోళనగా బీరువాల్లో పరిశీలించగా రూ.10 వేలు డబ్బులు, 50 గ్రాముల బంగారు దోపిడీకి గురైనట్లు గుర్తించి వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. కాగా సాయంత్రం దోపిడీకి గురైన ఇళ్లను క్లూస్‌టీం ఫింగర్‌ ప్రింట్స్‌ సేకరించింది. అలాగే డాగ్‌ స్క్వాడ్‌ ద్వారా పోలీసులు పరిశీలించారు. మదనపల్లెలో పట్టపగలే రెండు ఇళ్లలో దొంగతనాలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో స్థానికుల ఎవ్వరూ గమించకపోవడం గమనార్హం.

Updated Date - May 26 , 2024 | 11:31 PM