ఆ గోడౌన్లతో సంబంధం లేదు!
ABN , Publish Date - Dec 28 , 2024 | 04:27 AM
బేతంచర్లలో ఉన్న రేషన్ బియ్యం గోడౌన్లతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని వైసీపీ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి స్పష్టం చేశారు.

నిర్వహణలో బంధువులు ఉంటే నాకేంటి సంబంధం?
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
కర్నూలు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): బేతంచర్లలో ఉన్న రేషన్ బియ్యం గోడౌన్లతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని వైసీపీ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా బేతంచర్ల పట్టణంలోని స్టేట్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ (ఎస్డబ్ల్యూసీ) గోదాముతో పాటు ప్రైవేటు గోదాములో దాదాపు 1,300 బస్తాల రేషన్(650 క్వింటాళ్లు) బియ్యం మాయమైనట్లు గురువారం పౌరసరఫరా అధికారుల తనిఖీల్లో బయటపడిన విషయం తెలిసిందే!. ప్రైవేటు గోడౌన్ను నిర్వహిస్తున్న భాగస్వామ్య వ్యాపారుల్లో ఒకరిద్దరు.. బుగ్గన బంధువులు ఉండడంతో ఆయనపైనా విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో బుగ్గన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’తో ఫోన్లో మాట్లాడారు. ‘నా బంధువుల్లో కొందరు.. నలుగురైదుగురు భాగస్వామ్య వ్యాపారులతో కలిసి బేతంచర్లలో రేషన్ బియ్యం గోడౌన్ నిర్వహిస్తున్న మాట వాస్తవమే. అంతమాత్రాన నాకేం సంబంధం?. ఎన్నికల తరువాత టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికార పక్షం నేతల ఒత్తిళ్లతో గోడౌన్ నిర్వహణ వదులుకోవడంతో, కర్నూలు నగరానికి చెందిన ఓ వ్యక్తి నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలుగా గోడౌన్ల నిర్వహణలో ఎవరి ప్రమేయం ఉందో విచారణచేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. సివిల్ సప్లైస్ డైరెక్టర్గా ఎంపికైన వ్యక్తి ఒకరు ఈ గోడౌన్లను బేతంచర్ల నుంచి పక్క నియోజకవర్గానికి తరలించుకుపోయే ఉద్దేశంతో ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు’ అని బుగ్గన వివరణ ఇచ్చారు.