Share News

చీపురుపల్లిలో బొత్స X కళా

ABN , Publish Date - Mar 30 , 2024 | 06:04 AM

పెండింగ్‌లో ఉన్న శాసనసభ, లోక్‌సభ స్థానాలకు టీడీపీ తన అభ్యర్థులను ప్రకటించింది. శుక్రవారం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన విడుదల చేసిన నాలుగో జాబితాలో 9 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాల అభ్యర్థులు ఉన్నారు. తాజా జాబితాలో కొన్ని ఆసక్తికర ఎంపికలు చోటుచేసుకున్నాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో

చీపురుపల్లిలో బొత్స X కళా

భీమిలిలో గంటా.. టీడీపీ అభ్యర్థుల తుది జాబితా

గుంతకల్లులో జయరాం.. ఆలూరులో వీరభద్ర గౌడ్‌

దర్శిలో గొట్టిపాటి లక్ష్మికి చాన్స్‌.. రాజంపేటలో సుగవాసి

ఒంగోలు లోక్‌సభ మాగుంటకే.. భూపేశ్‌రెడ్డికి కడప

అప్పలనాయుడికి విజయనగరం.. రఘురామపై చర్చలు

టీడీపీలో చేరిన ‘పేట’ వైసీపీ నేత మల్లెల

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పెండింగ్‌లో ఉన్న శాసనసభ, లోక్‌సభ స్థానాలకు టీడీపీ తన అభ్యర్థులను ప్రకటించింది. శుక్రవారం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన విడుదల చేసిన నాలుగో జాబితాలో 9 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాల అభ్యర్థులు ఉన్నారు. తాజా జాబితాలో కొన్ని ఆసక్తికర ఎంపికలు చోటుచేసుకున్నాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణతో మాజీమంత్రి, పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకట్రావు తలపడనున్నారు. ఇక్కడ పోటీచేస్తారనుకున్న మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి టికెట్‌ సాధించారు. 2014లో ఆయన ఇక్కడి నుంచే గెలిచారు. 2019లో విశాఖ ఉత్తర నియోజకవర్గానికి మారారు. ఈ సీటు పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లడంతో గంటా మరోసారి భీమిలి బరిలో దిగుతున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి, ఒకప్పటి తన సన్నిహితుడైన అవంతి శ్రీనివా్‌సను ఎదుర్కోనున్నారు. కళావెంకట్రావు గతంలో ఎచ్చెర్ల స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆ సీటు పొత్తులో బీజేపీకి వెళ్లడంతో కళాకు ప్రత్యామ్నాయం చూపాల్సివచ్చింది. చీపురుపల్లిలో ఇప్పటికే ఆయన సోదరుడి కుమారుడు కిమిడి నాగార్జున టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్నారు. బొత్సను దీటుగా ఎదుర్కొనే క్రమంలో పార్టీ నాయకత్వం కళాకు టికెట్‌ ఇచ్చిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. పైగా కళా సామాజికవర్గమైన తూర్పుకాపులు చీపురుపల్లిలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ ఆయనకు బంధువర్గం కూడా అధికంగా ఉండడంతో అధిష్ఠానం ఆయనవైపు మొగ్గింది. వైసీపీ నుంచి ఇటీవలే వచ్చిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు సీటు కేటాయించారు. ఆయన అంతకుముందు కర్నూలు జిల్లా ఆలూరుకు ప్రాతినిధ్యం వహించారు. ఆలూరు సీటును లింగాయత్‌ సామాజికవర్గానికి చెందిన వీరభద్ర గౌడ్‌కు ఇచ్చారు. అనంతపురం జిల్లా కేంద్రం సీటు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి సమీప బంధువైన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు లభించింది. టీడీపీ సీనియర్‌ నేత దివంగత మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడి కుమారుడు సుగవాసి సుబ్రమణ్యంకు రాజంపేట అసెంబ్లీ సీటు ఇచ్చారు. ఈయనకు మొదట రాజంపేట లోక్‌సీటు సీటు ఇవ్వాలని అనుకున్నారు. అయితే అది పొత్తులో బీజేపీకి కేటాయించడంతో ఆయనకు అసెంబ్లీ సీటు ఇచ్చారు. ప్రకాశం జిల్లా దర్శి సీటు డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మికి లభించింది. ఆమె తండ్రి గొట్టిపాటి నరసయ్య గతంలో టీడీపీ మార్టూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. అల్లూరి జిల్లా పాడేరు(ఎస్టీ) సీటును పార్టీలోకి కొత్తగా వచ్చిన రమేశ్‌నాయుడికి కేటాయించారు.

మాగుంటకే చాన్సు

ఒంగోలు లోక్‌సభ అభ్యర్థిగా సిటింగ్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరును ప్రకటించారు. ముందు ఆయన కుమారుడు రాఘవరెడ్డిని నిలపాలనుకున్నారు. అయితే ఢిల్లీ మద్యం పాలసీ స్కాం కేసు తీవ్రత నేపథ్యంలో ఆయన్ను కాదని చివరకు శ్రీనివాసులరెడ్డికి కేటాయించారు. కడప లోక్‌సభ సీటు అనూహ్యంగా జమ్మలమడుగు నేత చదిపిరాళ్ల భూపేశ్‌రెడ్డికి లభించింది. ఆయన ఇప్పటి దాకా జమ్మలమడుగు అసెంబ్లీ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఆ సీటు పొత్తులో బీజేపీకి పోవడంతో కడప ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. విజయనగరం జిల్లా ఎచ్చెర్ల సీటు కోసం పోటీపడిన యువ నేత, తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడుకు విజయనగరం లోక్‌సభ సీటు లభించింది. వివాదరహితుడు కావడంతో ఆయనకు అక్కడ అవకాశం ఇచ్చారు. అనంతపురం లోక్‌సభ స్థానానికి బోయ సామాజికవర్గానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణను ఎంపిక చేశారు. ఈయన పార్టీలో హిందూపురం ప్రాంతానికి చెందిన సీనియర్‌ నేత.

సామాజిక కోణంలో..

144 అసెంబ్లీ, 17 లోక్‌సభ సీట్లకు టీడీపీ ప్రకటించిన అభ్యర్థులను సామాజిక కోణంలో పరిశీలిస్తే.. బీసీలకు అత్యధికంగా 34 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. ముస్లిం మైనారిటీలకు 3, ఎస్సీ-25, ఎస్టీ-4, కాపు-10, కమ్మ-32, రెడ్డి-27, వైశ్య-2, క్షత్రియ-5, వెలమ, బలిజకు చెరో సీటు కేటాయించారు. పార్లమెంటు సీట్లలో బీసీలకు 6, ఎస్సీ-3, రెడ్లు-4, కమ్మ వర్గానికి 4 సీట్లు కేటాయించారు.

రఘురామకు సీటు ఖాయం

నరసాపురం సిటింగ్‌ ఎంపీ రఘురామరాజుకు సీటు ఖాయమని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఆయనకు సీటివ్వాలని టీడీపీ-జనసేన-బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చాయని, ఆయనను ఎక్కడ నిలిపితే బాగుంటుందనే దానిపై సమాలోచనలు జరుగుతున్నాయని, ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక అసెంబ్లీ స్థానంలో ఆయన్ను నిలిపే అవకాశం ఉంది. దీనిపై రఘురామరాజు అభిప్రాయం కూడా తెలుసుకుని ఖరారు చేయనున్నారు.

Updated Date - Mar 30 , 2024 | 06:04 AM