Betting పందేనికి రాం.. రాం..!
ABN , Publish Date - May 27 , 2024 | 12:19 AM
సరిగా రెండు నెలల క్రితం వైనాట్ 175 అంటూ ప్రతి వైసీపీ నాయకుడి నోటా వచ్చేది. ఎన్నికల్లో టీడీపీ ఉండదనీ, ఆ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా పోటీచేసే అభ్యర్థులే లేరని వైసీపీ నాయకులు బహిరంగ సమావేశాల్లో పేర్కొన్నారు. అప్పట్లో వైసీపీ గెలుస్తుందని పందేనికి సై అంటూ ప్రగల్భాలు పలికారు. అలాంటివారే రానురాను తగ్గుతూ వచ్చారు.
![Betting పందేనికి రాం.. రాం..!](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
వైసీపీ తరఫున బెట్టింగ్కు ససేమిరా
డీలా పడుతున్న ఆ పార్టీ వర్గాలు
లక్షకు రూ.2 లక్షలు ఇస్తామంటున్న
కూటమి మద్దతుదారులు
అయినా ఎవరూ ముందుకురాని వైనం
హిందూపురం, మే 26: సరిగా రెండు నెలల క్రితం వైనాట్ 175 అంటూ ప్రతి వైసీపీ నాయకుడి నోటా వచ్చేది. ఎన్నికల్లో టీడీపీ ఉండదనీ, ఆ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా పోటీచేసే అభ్యర్థులే లేరని వైసీపీ నాయకులు బహిరంగ సమావేశాల్లో పేర్కొన్నారు. అప్పట్లో వైసీపీ గెలుస్తుందని పందేనికి సై అంటూ ప్రగల్భాలు పలికారు. అలాంటివారే రానురాను తగ్గుతూ వచ్చారు. ఎన్నికల పోలింగ్ దగ్గరపడేకొద్దీ 90 నుంచి నూరు శాతం వైసీపీ గెలుస్తుందని చెప్పారు. ఆ తరువాత మూడు నాలుగురోజులు కూడా గెలుపు తమదేనంటూ చెప్పుకొచ్చారు. ఏమైందో, ఏం తెలిసిందోగానీ నాలుగు రోజులుగా ఆ పార్టీ తరఫున గెలుస్తుందని పందెం కాయడానికి ఏఒక్కరూ ముందుకు రావట్లేదని సమాచారం. దీంతో కూటమి తరఫున రూపాయికి రెండు రూపాయలు ఇస్తామంటూ డబ్బు కలిపేందుకు సిద్ధంగా ఉన్నా హిందూపురం, పెనుకొండ ప్రాంతంలో ఒక్కరూ ముందుకు రావట్లేదు. నాలుగు రోజుల క్రితం వరకు పందెం కాయడానికి సిద్ధంగా ఉన్న కొంతమంది వైసీపీ నాయకులను ప్రశ్నిస్తే నోటివెంట మాటరావడం లేదు. హిందూపురం పట్టణంలో కొంతమంది కౌన్సిలర్లు కలిసి రూ.కోటి వేయడానికి సిద్ధంగా ఉన్నామని నాలుగు రోజుల క్రితం పేర్కొన్నారు. నిజమేకదా అని తెలుగుదేశం పార్టీ నాయకులతోపాటు మరికొంతమంది కూటమి గెలుస్తుందని డబ్బు రెడీ చేశాక.. వైసీపీ వారికి ఏమైందోకానీ తాము ఇప్పుడు సిద్ధంగా లేమంటూ చేతులెత్తేశారు.
కూటమి తరఫున ఆనలైనలో వెంపర్లాట
వైసీపీ తరఫున ప్రత్యక్షంగా ఎవరూ పందేనికి ముందుకు రాకపోవడంతో హిందూపురానికి చెందిన పలువురు కూటమికి 110 నుంచి 130 స్థానాలు వస్తాయని ఆనలైనలో బెట్టింగ్ కాస్తున్నారు. ఆనలైనలో వైసీపీ తరఫున పందెం వేసేవారు వేరే రాష్ట్రాలకు చెందినవారు కావడంతో బెట్టింగ్ సాగుతోందన్న వాదన వినిపిస్తోంది. అదే రాష్ట్రంలో ఉండి ఐదేళ్లు జగన పాలన, ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను చూసినవారెవరూ పందేనికి ముందుకు రావడం లేదని కొంతమంది బెట్టింగ్ ఆడేవారే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఇలా.. నాలుగైదు రోజులుగా వైసీపీ నాయకులు ఎందుకో డీలాపడ్డారు. హిందూపురంతో మొదలుకుని రాష్ట్రంలో అధికారం వరకు బెట్టింగ్కు ఆ పార్టీ నాయకులు ఎవరూ ముందుకు రావట్లేదు. పైపైకి తమ పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు తప్ప.. పందేనికి వచ్చేసరికి తమకెందుకని జారుకుంటున్నారు. దీనిని బట్టి ఆ పార్టీ నాయకులకే వైసీపీపై నమ్మకం లేదని కూటమి నాయకులు అంటున్నారు.