Share News

నమ్మి.. నిండా మునిగాం!

ABN , Publish Date - Mar 12 , 2024 | 04:42 AM

‘‘మా ఉద్యోగ సంఘ నేతలే మమ్మల్ని ముంచేశారు. వైసీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ ఉద్యోగుల ప్రయోజనాలను కాలరాశారు. టీడీపీ హయాంలో కేడర్‌ ఫిక్సేషన్‌ చేస్తామంటూ అప్పట్లో సెర్ప్‌(గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) సీఈవో పిలుపునిస్తే మాకు కేడర్‌ ఫిక్సేషన్‌ వద్దు క్రమబద్ధీకరణే కావాలంటూ పట్టుబట్టారు. జగన్‌

నమ్మి.. నిండా మునిగాం!

జగన్‌ సర్కార్‌ నిలువునా ముంచేసిందంటున్న సెర్ప్‌ ఉద్యోగులు

వైసీపీ పెద్దలతో ఉద్యోగ సంఘ నేతలు కుమ్మక్కయ్యారని ఆగ్రహం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘‘మా ఉద్యోగ సంఘ నేతలే మమ్మల్ని ముంచేశారు. వైసీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ ఉద్యోగుల ప్రయోజనాలను కాలరాశారు. టీడీపీ హయాంలో కేడర్‌ ఫిక్సేషన్‌ చేస్తామంటూ అప్పట్లో సెర్ప్‌(గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) సీఈవో పిలుపునిస్తే మాకు కేడర్‌ ఫిక్సేషన్‌ వద్దు క్రమబద్ధీకరణే కావాలంటూ పట్టుబట్టారు. జగన్‌ వచ్చిన తర్వాత క్రమబద్ధీకరణ సాధిస్తామని చెప్పారు. ఇప్పుడేమో క్రమబద్ధీకరణ సంగతి సరే సరి... కనీసం కేడర్‌ ఫిక్సేషన్‌ చేయకుండా మొండిచేయి చూపారు’’ అంటూ సెర్ప్‌ ఉద్యోగులు మండిపడుతున్నారు. రాయలసీమకు చెందిన కొందరు ఉద్యోగ సంఘాల నేతలు వైసీపీ నేతలతో కుమ్ముక్కై సుమారు 4 వేల మందికిపైగా ఉన్న సెర్ప్‌ సిబ్బందికి అన్యాయం చేశారని వాపోతున్నారు. క్రమబద్ధీకరణ చేస్తామని మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారని, రెండేళ్ల నుంచి ఒక్క సారి కూడా సంఘం సమావేశం కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ హయాంలో ఆఫర్‌..

దీర్ఘకాలంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలంటూ సెర్ప్‌ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారు. గత ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేసి సెర్ప్‌ ఉద్యోగులకు రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ చేపట్టడం సాధ్యం కాదని తేల్చేసింది. అందుకే వారికి ఉపశమనం కలిగించేందుకు గతంలో ఎప్పుడూ లేని విధంగా మిగతా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఒక్కసారి 43 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేశారు. దీంతో సెర్ప్‌ ఉద్యోగులకు భారీగా జీతాలు పెరిగాయి. దీంతో పాటు కేడర్‌ ఫిక్సేషన్‌ చేస్తామంటూ అప్పట్లో సెర్ప్‌ సీఈవోగా ఉన్న కృష్ణమోహన్‌ ఉద్యోగ సంఘాల నేతలను పిలిచారు. అయితే కొంత మంది ఉద్యోగ సంఘాల నేతలు ఆయన చేసిన ఆఫర్‌ను కాలదన్నుకున్నారు. క్రమబద్ధీకరణ చేయాలని, లేకపోతే జగన్‌ సర్కార్‌ వచ్చిన తర్వాత రెగ్యులరైజేషన్‌ చేయించుకుంటామని తెగేసి చెప్పారు. దీంతో అప్పట్లో సెర్ప్‌ ఉద్యోగుల కేడర్‌ ఫిక్సేషన్‌ ఆగిపోయింది.

వైసీపీ సర్కార్‌ వచ్చిన తర్వాత....

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని 2019 ఎన్నికల ముందు జగన్‌ ప్రతి సమావేశంలోనూ హామీ ఇచ్చారు. సెర్ప్‌ ఉద్యోగ సంఘాల నేతలు ఆ హామీపై ఉద్యోగులను నమ్మించారు. తీరా జగన్‌ సీఎం అయిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ ప్రక్రియే ప్రహసనంగా మారింది.సెర్ప్‌ ఉద్యోగులు కాంట్రాక్టు ఉద్యోగుల కిందకు రారని జగన్‌ సర్కార్‌ తేల్చేసింది. దీంతో కనీసం కేడర్‌ ఫిక్సేషన్‌ చేయాలంటూ సెర్ప్‌ ఉద్యోగులు మొరపెట్టుకున్నారు. మరికొన్ని సమస్యలనూ ఏకరవు పెట్టారు. వాటిని ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. నెలనెలా జీతాలే సక్రమంగా ఇచ్చిన పరిస్థితులు లేకపోవడంతో విసిగిపోయిన సెర్ప్‌ ఉద్యోగుల జేఏసీ సెర్ప్‌ సీఈవోకు సమ్మె నోటీసు ఇచ్చింది. ప్రభుత్వం స్పందించకపోవడంతో సెర్ప్‌ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. వారి క్రమబద్ధీకరణ కోసం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఒక్కసారి కూడా సమావేశం కాలేదని వాపోతున్నారు.

ఇవీ డిమాండ్లు..

సెర్ప్‌ను ప్రభుత్వ సంస్థగా గుర్తించి అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు కేడర్‌ ఫిక్స్‌ చేస్తూ పేస్కేల్‌ అమలుచేసి క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్‌ చేశా రు. వారి సర్వీసు క్రమబద్ధీకరణకు ఆర్థికశాఖ ద్వారా సెర్ప్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో శాంక్షన్‌ పోస్టులుగా ఇచ్చిన మెమోను జీవో రూపంలోకి తీసుకురావాలన్నారు. ప్రస్తుతం అమలవుతున్న ఈపీఎఫ్‌ సీలింగ్‌ విధానం తీసేసి మూలవేతనంపై 100 శాతం ఈపీఎ్‌ఫను అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. ఎంఎ్‌ససీసీలకు 12వ సెర్ప్‌ ఈసీ సమావేశంలో తీర్మానం ప్రకారం హెచ్‌ఆర్‌ పాలసీని అమలు చేస్తూ... పేస్కేల్‌ వర్తింపచేయాలని, సపోర్టింగ్‌ స్టాఫ్‌, ఎల్‌2, ఎల్‌3తో పాటు అన్ని కేడర్లకు పదోన్నతి, ఇంక్రిమెంట్‌ ఇవ్వాలన్నారు. సెర్ప్‌ హెచ్‌ఆర్‌ పాలసీ ప్రకారం రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లు వర్తింపచేస్తూ అర్హులైన ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించాలని కోరారు. కారుణ్య నియామకాలు జరిపి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, సెర్ప్‌ సిబ్బంది పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులకు అమలుచేస్తున్న గ్రాట్యుటీ రూ.16 లక్షలు, హెచ్‌ఆర్‌ఏ జీవోను సెర్ప్‌ ఉద్యోగులకూ అమలు చేయాలనే డిమాండ్‌ చేస్తున్నారు.

సజ్జల మాటలు నమ్మి సమ్మె విరమణ..

23 ఏళ్లుగా సెర్ప్‌లో పనిచేస్తున్న ఈ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక పథకాలన్నీ అమలు చేస్తున్నారు. నవరత్నాల్లో భాగంగా వైఎ్‌సఆర్‌ ఆసరా, వైఎ్‌సఆర్‌ చేయూత, నాడు-నేడు, సున్నా వడ్డీ, జగనన్న తోడు, జగనన్న హౌసింగ్‌ కాలనీ నిర్మాణం, పేదలకు సుస్థిర జీవనోపాధుల పెంపుదల వంటి సంక్షేమ పథకాలు సెర్ప్‌ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుని సెర్ప్‌ ఉద్యోగుల డిమాండ్లను అన్నీ పరిష్కరిస్తామని, విధుల్లోకి చేరాలని సూచించారు. వైసీపీ నేతలతో అంటకాగిన ఉద్యోగ సంఘం నేతలు సజ్జల మాటలు నమ్మి సమ్మెను విరమింపచేశారు.

తాడేపల్లి ప్యాలెస్‌ వద్దకే రానీయట్లేదు..

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాయ మాటలు చెప్పి సెర్ప్‌ ఉద్యోగులను సమ్మె విరమింపచేశారని, ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్‌ వద్దకు రానీయడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ ఉద్యోగ నేతల కారణంగానే తాము ఈ దుస్థితి ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని ప్రతినిధులుగా ఎంచుకున్నందున దారుణంగా మోసపోయామని మండిపడుతున్నారు. ఇప్పటికైనా వైసీపీ మాటున ఉద్యోగులకు చేసిన మోసం గ్రహించాలంటూ సెర్ప్‌ ఉద్యోగులు వాట ్సప్‌ సందేశాలు పంపుతున్నారు.

Updated Date - Mar 12 , 2024 | 07:06 AM