Share News

ధైర్యంగా ఉండు తమ్ముడూ.. నేనున్నా..!

ABN , Publish Date - May 31 , 2024 | 03:37 AM

‘ధైర్యంగా ఉండు తమ్ముడూ.. నీకు నేనున్నా. పార్టీ అండగా ఉంటుంది..’’ అని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నోముల మాణిక్యరావుకు టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు.

ధైర్యంగా ఉండు తమ్ముడూ.. నేనున్నా..!

పిన్నెల్లి బాధితుడు మాణిక్యరావుకు బాబు భరోసా

అమరావతి (ఆంధ్రజ్యోతి), మాచర్ల టౌన్‌, మే 30: ‘‘ధైర్యంగా ఉండు తమ్ముడూ.. నీకు నేనున్నా. పార్టీ అండగా ఉంటుంది..’’ అని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నోముల మాణిక్యరావుకు టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం కండ్లకుంటకు చెందిన టీడీపీ ఏజెంట్‌ మాణిక్యరావు, ఆయన కుటుంబ సభ్యులపై మాచర్ల నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన వర్గం దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాణిక్యరావు గురువారం హైదరాబాద్‌లో తమ పార్టీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. పోలింగ్‌ రోజున కండ్లకుంట పోలింగ్‌ కేంద్రంలో టీడీపీ ఏజెంట్‌గా ఉన్న తనపై, తన కుటుంబంపై పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి, వైసీపీ గూండాలు చేసిన దాడిని చంద్రబాబుకు వివరించారు. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చానని వారు తనపై కక్ష గట్టారని చెప్పారు. పిన్నెల్లి సోదరులు తనను, తన కుటుంబాన్ని అంతమొందించేందుకు ప్రైవేటు సైన్యాన్ని ఉసిగొల్పుతున్నారని వాపోయారు. ప్రాణ భయంతో హైదరాబాద్‌లో ఉంటున్నానని చెప్పారు. స్పందించిన చంద్రబాబు.. ‘‘ఎంతో సాహసోపేతమైన పోరాటం చేశావు తమ్ముడు. సమాజంలో అరాచకాలను అరికట్టాలంటే నీలాంటి యువకులు టీడీపీ వెంట నడవాలి. నువ్వేం అధైర్య పడకు.. నీకు నేనుంటా.. ధైర్యంగా ఉండు’’ అని భరోసా ఇచ్చారు. కాగా, తెలుగోడు పేరుతో చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించిన డాక్టర్‌ వెంకట్‌ కూడా చంద్రబాబును కలిశారు. ఆయన తీసిన చిత్రాన్ని అభినందించిన చంద్రబాబు శాలువాతో సన్మానించారు.

Updated Date - May 31 , 2024 | 03:38 AM