టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి... ముగ్గురు పోలీసులపై వేటు
ABN , Publish Date - Jul 31 , 2024 | 02:31 AM
రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై నాడు మూకుమ్మడిగా దాడి చేసి విధ్వంసం సృష్టించిన ఘటన వెనుక అడుగడుగునా పోలీసుల వైఫల్యం ఉన్నట్లు విచారణలో స్పష్టమైంది.
మంగళగిరి రూరల్ సీఐ, ఎస్సైల సస్పెన్షన్
దాడి విషయం ముందే తెలిపినా నిర్లక్ష్యం
పైగా టీడీపీ నాయకులపైనే తిరిగి కేసు
దర్యాప్తులో బయటకు వస్తున్న నిజాలు
గుంటూరు, జూలై 30 : రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై నాడు మూకుమ్మడిగా దాడి చేసి విధ్వంసం సృష్టించిన ఘటన వెనుక అడుగడుగునా పోలీసుల వైఫల్యం ఉన్నట్లు విచారణలో స్పష్టమైంది. ఇందుకు బాధ్యులైన అప్పటి మంగళగిరి రూరల్ సీఐ భూషణం, ఎస్ఐలు లోకేశ్, క్రాంతి కిరణ్లను సస్పెండ్ చేస్తూ మంగళవారం రేంజ్ ఐజీ సర్వశేష్ఠ త్రిపాఠీ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. అదేవిధంగా ఈ ఘటనలో అప్పటి మంగళగిరి ఎస్ఐలుగా ఉన్న విజయకుమార్ రెడ్డి, బి.రమేశ్బాబులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం సీఐ భూషణం వీఆర్లో ఉండగా, లోకేశ్ ఇంటెలిజెన్స్లో, క్రాంతికిరణ్ వీఆర్లో ఉన్నారు. నాడు వైసీపీ నేతలు చెప్పిందే వేదంగా పాటించి ఐపీసీని పక్కనబెట్టారన్న ఆరోపణలను ఈ ముగ్గురూ ఎదుర్కొంటున్నారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబరు 19న వైసీపీ గూండాలు దాడికి తెగబడిన విషయం విదితమే.
అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండగా, పోలీసులు కనీసం చట్ట పరిధిలో వ్యవహరించకుండా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పూర్తి నిర్లక్ష్య ధోరణి అవలంబించారన్న విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరగబోతుందన్న ముందస్తు సమాచారం కార్యాలయ ఇన్చార్జ్ వల్లూరు కుమారస్వామి మంగళగిరి రూరల్ పోలీస్ ేస్టషన్కు అందించారు. కార్యాలయానికి రక్షణ కల్పించాలని కోరారు. తొలుత మంగళగిరి టౌన్ పోలీస్ స్టషన్కు ఫోన్ చేయగా అది తమ పరిధి కాదని తెలిపారు. మంగళగిరి రూరల్ పోలీస్ ేస్టషన్కు ఫోన్ చేయగా, నానా ప్రశ్నలు వేస్తూ అక్కడి సిబ్బంది కాలయాపన చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వందలాదిమంది వైసీపీ అల్లరి మూకలు, రౌడీషీటర్లు పెద్ద ఎత్తున కార్లలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. ఇంత జరుగుతున్నా మంగళగిరి రూరల్ పోలీసులు కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు.
అప్పట్లో మంగళగిరి రూరల్ స్టేషన్లో ఒక సీఐ, నలుగురు ఎస్ఐలు ఉన్నారు. ఘటన జరిగిన తరువాత సాయంత్రం టీడీపీ నేతలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న ఓ వ్యక్తిని పార్టీ శ్రేణులు అటకాయించి ప్రశ్నించారు. అయితే, ఆయన ఇంటెలిజెన్స్ విభాగం ఎస్ఐ అని, ఆయనపై తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారని, కులం పేరుతో దూషించారని తిరిగి టీడీపీ నేతలపైనే మంగళగిరి పోలీస్ ేస్టషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పార్టీ కార్యాలయం పై దాడి ఘటనపై మాత్రం తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి ఫైలు పక్కన పడేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయే వరకు ఎవరు కూడా ఆ కేసు గురించి పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. దర్యాప్తునకు ఆదేశించారు.