వెంటనే ఎమ్మెల్యేను అరెస్ట్ చేయండి
ABN , Publish Date - May 23 , 2024 | 03:40 AM
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
![వెంటనే ఎమ్మెల్యేను అరెస్ట్ చేయండి](https://media.andhrajyothy.com/media/2024/20240511/AA_eadc2b48d3.jpg)
రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈసీ ఆదేశం
ఈవీఎం ధ్వంసం ఘటనపై తీవ్ర ఆగ్రహం
ఎక్స్లో లోకేశ్ చేసిన పోస్టుపై స్పందన
త్వరలో ఎమ్మెల్యే, ఇతర నిందితులను
అరెస్ట్ చేస్తామని ఈసీకి డీజీపీ నివేదిక
4 బృందాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడి
న్యూఢిల్లీ, మే 22 (ఆంధ్రజ్యోతి): మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ను అరెస్ట్ చేయకుండా జాప్యం చేసినందుకు రాష్ట్ర సీఈవోపై మండిపడింది. వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించింది. ఎక్స్ వేదికగా టీడీపీ నేత లోకేశ్ పోస్టు చేసిన వీడియో లింక్ను జతచేస్తూ పలు ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటలలోపు సమగ్ర నివేదిక సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్ కుమార్ ఆదేశించారు. కాగా.. ఎమ్మెల్యే పిన్నెల్లితో పాటు ఇతర నిందితులను వీలైనంత త్వరలో అరెస్టు చేస్తామని ఎన్నికల కమిషన్కు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తానివేదించారు. ఎఫ్ఐఆర్లో ఏ1గా ఎమ్మెల్యేను చేర్చి నిందితులను అరెస్టు చేసేందుకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈవీఎం ధ్వంసం లో ప్రధాన నిందితుడైన పిన్నెల్లి పారిపోయినట్లు తెలియడంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్టు వివరించారు.