Share News

వైసీపీ అభ్యర్థి టీషర్టుల పట్టివేత

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:19 AM

వైసీపీ అభ్యర్థి బొమ్మతో ఉన్న 1525 టీషర్టులతో పాటు 500 ఫ్యాన్‌ గుర్తు ఉన్న బెలూన్లను బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండల పరిధిలోని చెక్‌పోస్టు వద్ద బుధవారం పోలీసులు పట్టుకున్నారు.

వైసీపీ అభ్యర్థి టీషర్టుల పట్టివేత

కేసు నమోదు చేయని పోలీసులు

బాపట్ల, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ అభ్యర్థి బొమ్మతో ఉన్న 1525 టీషర్టులతో పాటు 500 ఫ్యాన్‌ గుర్తు ఉన్న బెలూన్లను బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండల పరిధిలోని చెక్‌పోస్టు వద్ద బుధవారం పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఎ్‌సటీ (స్టాటిస్టిక్‌ సర్వేలైన్స్‌ టీమ్స్‌)తో పాటు పోలీసులూ సంయుక్తంగా ఈ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి చీరాల వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సులో వీటిని గుర్తించారు. వీటికి సంబంధించి రిసీవింగ్‌ రశీదు పర్చూరు వైసీపీ అభ్యర్థి ఎడం బాలాజీ పేరు మీద ఉన్నట్లు సమాచారం. వీటిని చందోలు పోలీస్‌ స్టేషన్‌కు తరలించగా జీఎ్‌సటీ అధికారులు వచ్చి వాటి విలువను లెక్కగట్టారు. కాగా, ఎన్నికల ప్రచారానికి సంబంధించిన మెటీరీయల్‌ విలువ మొత్తం పదివేలు దాటితే సంబంధిత ఆర్వో కానీ, లేక సీఈవో అనుమతితోనే వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే కేసు నమోదు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. పోలీసులు పట్టుకున్న వాటి విలువ దాదాపు లక్ష రూపాయలకు పైనే ఉండొచ్చని తెలుస్తోంది. కానీ కేసు నమోదు లాంటిదేమీ లేకపోగా ఆ సామగ్రిని స్టేషన్‌లో ఉంచడంతో సరిపెట్టారు. డిస్ట్రిక్ట్‌ గ్రీవెన్స్‌సెల్‌లో సరైన పత్రాలు చూపించి వాటిని తీసుకెళ్లొచ్చనేది పోలీసుల వాదనగా ఉంది.

Updated Date - Apr 25 , 2024 | 04:19 AM