టెట్, టీఆర్టీ షెడ్యూల్పై ముగిసిన వాదనలు
ABN , Publish Date - Feb 29 , 2024 | 03:36 AM
ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్), ఏపీ టీచర్ నియామక పరీక్ష (ఏపీ టీఆర్టీ)ల మధ్య సముచిత సమయం ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్
![టెట్, టీఆర్టీ షెడ్యూల్పై ముగిసిన వాదనలు](https://media.andhrajyothy.com/media/2024/20240227/pp_fdacf8b3c4.jpg)
తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
అమరావతి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్), ఏపీ టీచర్ నియామక పరీక్ష (ఏపీ టీఆర్టీ)ల మధ్య సముచిత సమయం ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ బుధవారం ఆదేశాలిచ్చారు. టెట్, టీఆర్టీ మధ్య సముచిత సమయం ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం. పెద్దిరాజు, మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత నోటిఫికేషన్ రద్దుచేసి ఈ పరీక్షల నిర్వహణకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా పిటిషనర్ల తరఫున న్యాయవాది జవ్వాజి శరత్చంద్ర వాదనలు వినిపించారు. టెట్ ముగిసిన తర్వాత టీఆర్టీ రాయడానికి సిద్ధమయ్యేందుకు తగిన సమయం లేదని, అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని విన్నవించారు. అభ్యర్థులు పరీక్షకు సిద్ధమయ్యేందుకు తగిన సమయం ఇచ్చేలా షెడ్యూల్లో మార్పులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.