దాడికి ముందు సజ్జలతో భేటీ
ABN , Publish Date - Oct 27 , 2024 | 04:33 AM
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి ముందు వైసీపీ ఆఫీసులో సజ్జల రామకృష్ణారెడ్డితో ఆ పార్టీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, నందిగం సురేష్, దేవినేని అవినాశ్ భేటీ అయ్యారని ప్రధాన నిందితుడు వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య సీఐడీ విచారణలో చెప్పినట్లు తెలిసింది.
అప్పిరెడ్డి, రఘురాం, నందిగం, అవినాశ్ సమావేశమై మాట్లాడారు
వారి ఆదేశాలతోనే టీడీపీ కార్యాలయంపైకి దాడికి వెళ్లాం
అక్కడ పట్టాభి ఉంటే చంపాలనుకున్నాం
సీఐడీ విచారణలో కీలక విషయాలు వెల్లడించిన చైతన్య!
గుంటూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి ముందు వైసీపీ ఆఫీసులో సజ్జల రామకృష్ణారెడ్డితో ఆ పార్టీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, నందిగం సురేష్, దేవినేని అవినాశ్ భేటీ అయ్యారని ప్రధాన నిందితుడు వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య సీఐడీ విచారణలో చెప్పినట్లు తెలిసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న చైతన్యను కోర్టు మూడు రోజులు సీఐడీ కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి రోజు చైతన్య విచారణకు సహకరించకపోగా, కేసును తప్పుదారి పట్టించేలా వ్యవహరించినట్లు తెలిసింది. కాగా రెండో రోజు దాడికి సంబంధించి కీలక విషయాలను సీఐడీ విచారణలో చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆ వివరాల ప్రకారం.. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు మధ్యాహ్నం 3 గంటలకు తన అనుచరులు తియ్యగూర గోపిరెడ్డి, పేరూరి అజయ్, రామిశెట్టి విశాల్ తదితరులతో తాను నాజ్ సెంటర్లో ఉండగా వైసీపీ నేత నూనె ఉమామహేశ్వర్రెడ్డి ఫోన్ చేసి వెంటనే తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లాలని చెప్పాడని చైతన్య పేర్కొన్నారు. అంతేగాక అనుచరులను సిద్ధంగా ఉంచమని చెప్పాడన్నారు. ఉమామహేశ్వరరెడ్డి నాజ్ సెంటర్కు రాగా..
తామంతా కారులో తాడేపల్లికి వెళ్లామని తెలిపారు. ఆ సమయంలో కారులో ఉమామహేశ్వరరెడ్డితో పాటు గడ్డంతో ఉన్న మరో వ్యక్తి ఉన్నాడని, అయితే అతడు ఎవరో తనకు తెలియదని చెప్పాడు. తాము వైసీపీ కార్యాలయానికి వెళ్లిన సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డితో అప్పిరెడ్డి, రఘురాం, నందిగం సురేష్, దేవినేని అవినాశ్ తదితరులు సమావేశమై ఉన్నారని పేర్కొన్నాడు. ఆ తర్వాత సమావేశంలో పాల్గొన్న నేతల నుంచి వచ్చిన ఆదేశాలతో అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న 200 మంది వరకు కార్యకర్తలతో కలిసి టీడీపీ కార్యాలయంపై దాడికి బయలుదేరామని చైతన్య వివరించాడు. జగన్ను ధూషించిన పట్టాభి అంతు చూడాలని అనుకున్నామన్నాడు. కొంత మంది టీడీపీ ఆఫీసులో పట్టాభి ఉండే చంపేయండి రా! అంటూ కేకలు వేశారని, ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్లతో అక్కడున్న వారిని కొట్టామని చెప్పినట్టు తెలిసింది. దేవినేని అవినాశ్ మరికొందరు టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చి దాడి తీరును పరిశీలించారని తెలిపారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన మంగళగిరి రూరల్ సీఐ, ఓ కానిస్టేబుల్పై తాను దాడి చేశానని పానుగంటి చెప్పాడు. దాడి అనంతరం ఖాజా మొహిద్దిన్, బత్తుల దేవానంద్, అచ్చాల వెంకటరెడ్డి తదితరులతో తాను ఏపీ07 బీఈ 2345 నంబరు గల కారులో తిరిగి వైసీపీ కార్యాలయం వద్దకు వెళ్లినట్లు విచారణలో వెల్లడించినట్టు సమాచారం.