Anganwadi : తడాఖా చూపిస్తాం!
ABN , Publish Date - Jan 05 , 2024 | 04:13 AM
‘‘అమ్మలా అదరించడమే కాదు... ఆది పరాశక్తుల్లా మారి దుష్టశిక్షణ కూడా చేస్తాం’’ అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్వాడీలు తేల్చిచెప్పారు.
జగన్ సర్కారుకు అంగన్వాడీల హెచ్చరిక
నోటీసులకు బెదిరేది లేదని స్పష్టీకరణ
‘మున్సిపల్’ సమ్మె ఉధృతం
విశాఖలో కార్మికుడి ఆత్మహత్యాయత్నం
(ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్)
‘‘అమ్మలా అదరించడమే కాదు... ఆది పరాశక్తుల్లా మారి దుష్టశిక్షణ కూడా చేస్తాం’’ అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్వాడీలు తేల్చిచెప్పారు. నోటీసులు ఇస్తే బెదిరిపోమని, తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతామని, డిమాండ్లను పరిష్కరించే వరకూ సమ్మెను విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనలు గురువారం 24వ రోజు కొనసాగాయి. ‘‘పోలేరమ్మ, బంగారమ్మ, పైడితల్లమ్మ, నూకాలమ్మా, అంకాలమ్మా.. మా మొర వినండి. ముఖ్యమంత్రి జగన్, మంత్రులు, అధికారులకు మంచి బుద్ధిని ప్రసాదించి మా సమస్యలు పరిష్కరించేలా చూడండమ్మా..’’ అంటూ విజయనగరం కలెక్టరేట్ వద్ద శిబిరంలో అంగన్వాడీలు వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద శిబిరంలో అంగన్వాడీల దుస్థితి, ప్రభుత్వం తీరుపై సోది చెబుతూ నిరసన తెలిపారు. ఈ నెల 6న అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో జరిగే కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ సమీపంలోని అంగన్వాడీల దీక్షా శిబిరం చుట్టూ పోలీసులు ఇనుప బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసుల తీరుపై అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శింగనమల నియోజకవర్గ కేంద్రంలో అంగన్వాడీలు ఉరి వేసుకుని, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మోకాళ్లపై నిలబడి గోవింద నామాలు చెబుతూ నిరసన తెలిపారు.
నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసిన జీవో ప్రతులను అంగన్వాడీలు దహనం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి పట్టిన దెయ్యాన్ని వదిలిస్తామంటూ తిరుపతి జిల్లా నాయుడుపేటలో అంగన్వాడీ ఉద్యోగులు వేపాకులు పట్టుకుని చిందులు తొక్కుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం నుంచీ విధులకు హాజరు కావాలంటూ సీడీపీవోలు అందజేసిన నోటీసు ప్రతులను తిరుపతి, పిచ్చాటూరు, పుత్తూరుల్లో ఉద్యోగులు ఆందోళనా శిబిరాల ఎదుట తగులబెట్టారు. కోట మండల కేంద్రంలో అంగన్వాడీ ఉద్యోగుల రిలే దీక్షకు చిన్నారులు హాజరై మద్దతు ప్రకటించగా పిచ్చాటూరులో ఉద్యోగులు సోది చెబుతూ నిరసన తెలిపారు. ఏలూరు జిల్లా పెదపాడులో మోకాళ్లపై నిలబడ్డారు. పోలవరంలో జీవో ప్రతులను దహనం చేశారు. ముసునూరులో గంగిరెద్దుకు వినతిపత్రం ఇచ్చారు. ప్రకాశం జిల్లాలోని అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టుల కేంద్రాల్లో, ఒంగోలులోని ప్రకాశం భవనం ఎదుట అంగన్వాడీల ధర్నాలు కొనసాగాయి. మార్కాపురం, దర్శి, కనిగిరి, గిద్దలూరు, వైపాలెం, పొదిలి, కొండపిలలో కలెక్టర్ పంపిన నోటీసులను దహనం చేశారు. శ్రీకాకుళం అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీలు ఒంటికాలిపై నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరులో జగన్ పేరును ముఖానికి మాస్క్ పెట్టుకొని ఓ కార్యకర్త బ్యాటింగ్ చేయగా.. అంగన్వాడీ పేరుతో మరో కార్యకర్త బౌలింగ్ చేసి జగన్ను క్లీన్ బౌల్డ్ చేశారు. విజయవాడ ధర్నాచౌక్లో ఆందోళన చేస్తున్న కార్మికులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ బాబూరావు మద్దతు పలికారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆసుల రంగనాయకులు మాట్లాడుతూ.. కార్మికులను నమ్మించి మోసం చేసిన జగన్ను గద్దె దించే వరకు ఆందోళనలు కొనసాగుతాయన్నారు. మైలవరంలో అంగన్వాడీలు రాస్తారోకో నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట, సీతానగరం, కురుపాంలో మోకాళ్లపై కూర్చొని, సాలూరులో ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరు, కొండాపురంలో పొర్లుదండాలు పెట్టి, బద్వేలులో కళ్లకు గంతలు కట్టుకున్నారు. పోరుమామిళ్లలో ఆటోలను తాళ్లతో లాగారు. బద్వేలు, అన్నమయ్య జిల్లాలో జీవో ప్రతులు దహనం చేశారు. తంబళ్లపల్లెలో వాటర్ట్యాంకు పైకి ఎక్కి నిరసన తెలిపారు.
9లోగా సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ
చట్ట ప్రకారం సమ్మె చేస్తున్న అంగన్వాడీలను తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు స్పష్టం చేశారు. గురువారం నెల్లూరులో అంగన్వాడీలనుద్దేశించి మాట్లాడారు. సమ్మె విరమించకుంటే అందరినీ డిస్మిస్ చేస్తామని రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారని, ఆ కాగితాలు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని ఎద్దేవా చేశారు. బెదిరింపులు మాని సామరస్యంగా చర్చలు జరపాలని సూచించారు. లేకుంటే ఈ నెల 9న అన్ని కార్మిక సంఘాలు, వివిధ యూనియన్లతో పెద్ద ఎత్తున తరలివచ్చి అంగన్వాడీలకు మద్దతుగా నిలుస్తామని హెచ్చరించారు.