Share News

కొనసాగుతున్న వరద

ABN , Publish Date - Jul 31 , 2024 | 02:29 AM

గోదావరి వరద కొనసాగుతోంది. మంగళవారం భద్రాచలం వద్ద స్వల్పంగా పెరుగుదల కనిపించగా..

కొనసాగుతున్న వరద

భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి

మొదటి ప్రమాదహెచ్చరిక జారీ

ధవళేశ్వరం వద్ద తగ్గుముఖం

రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి/పోలవరం, జూలై 30: గోదావరి వరద కొనసాగుతోంది. మంగళవారం భద్రాచలం వద్ద స్వల్పంగా పెరుగుదల కనిపించగా.. దవళేశ్వరం బ్యారేజీ వద్ద కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రాత్రి 7 గంటలకు బ్యారేజీ వద్ద నీటిమట్టం 12.60 అడుగులకు చేరింది. ఇది 11.75 అడుగులకు దిగితే మొదటి ప్రమాద హెచ్చరికను కూడా వెనక్కి తీసుకుంటారు. ప్రస్తుతం బ్యారేజీ నుంచి 11,19,425 క్యూసెక్కులు దిగువకు పోతోంది. వాస్తవానికి సోమవారం రాత్రి వరకూ భద్రాచలం వద్ద నీటిమట్టం తగ్గుతూ వచ్చింది. రాత్రి 9 గంటలకు అది 42.80 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల వరకూ అదే నీటిమట్టం కొనసాగింది. కానీ.. ఉదయం 7 గంటలకు అనూహ్యంగా పది పాయింట్లు పెరిగి 42.90 అడుగులకు చేరింది. అక్కడ నుంచి నెమ్మదిగా పెరుగుతూ 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తర్వాత స్వల్పంగా పెరుగుతూ రాత్రి 7 గంటలకు 43.60 అడుగులకు చేరింది. బుధవారానికి వరద తగ్గుముఖం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలవరంలో గోదావరి నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. స్పిల్‌వే ఎగువన 32.710 మీటర్లు, దిగువన 24.300 మీటర్లు నమోదైనట్లు ఈఈలు పి.వెంకటరమణ, మల్లికార్జునరావు తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 20 పంపులు, 20 మోటార్లతో 6,726 క్యూసెక్కుల గోదావరి వరద జలాలు దిగువకు విడుదల చేసినట్లు డీఈఈ పెద్దిరాజు తెలిపారు.

Updated Date - Jul 31 , 2024 | 07:27 AM