Share News

కూటమిదే పీఠం!

ABN , Publish Date - Jun 03 , 2024 | 03:57 AM

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ కూటమికే అధికారం దక్కబోతోందని ‘ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా’ ఎగ్జిట్‌ పోల్‌ పేర్కొంది.

కూటమిదే పీఠం!

98-120 సీట్లు వచ్చే అవకాశం!

అసెంబ్లీ ఫలితాలపై ‘ఇండియా టుడే’ ఎగ్జిట్‌ పోల్‌

వైసీపీకి 55 నుంచి 77 స్థానాలు

అతి పెద్ద పార్టీగా టీడీపీ

78-96 సీట్లు వచ్చే చాన్సు

జనసేనకు 16-18, బీజేపీకి 4-6

మొత్తంగా ఎన్డీయేకి 51% ఓట్లు

వైసీపీ 44 శాతానికే పరిమితం?

అమరావతి, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ కూటమికే అధికారం దక్కబోతోందని ‘ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా’ ఎగ్జిట్‌ పోల్‌ పేర్కొంది. లోక్‌సభ స్థానాలపై శనివారం ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను విడుదల చేసిన ఈ సంస్థ.. అసెంబ్లీ సీట్లపై అంచనాలను ఆదివారం విడిగా వెల్లడించింది. దీని ప్రకారం.. 175 స్థానాల రాష్ట్ర అసెంబ్లీలో టీడీపీ కూటమికి 98 నుంచి 120 వరకు లభించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో 151 చోట్ల గెలిచిన వైసీపీ 55 నుంచి 77 సీట్లకే పరిమితమవుతుంది. కూటమిలో పార్టీల వారీగా విడిగా చూస్తే టీడీపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. దానికి 78-96 సీట్లు, జనసేనకు 16-18 సీట్లు, బీజేపీకి 4 నుంచి 6 సీట్లు దక్కుతాయి. అలాగే టీడీపీ కూటమికి మొత్తంగా 51 శాతం ఓట్లు వస్తాయని, వైసీపీకి 44 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ వేటికవి పోటీచేశాయి.

తాజా ఎన్నికల్లో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో బరిలోకి దిగాయి. గత ఎన్నికలతో పోల్చితే ఎన్డీయే ఈ దఫా 85కి పైగా స్థానాలను అదనంగా గెలుచుకోబోతోందని సర్వే సంస్థ పేర్కొంది. కాంగ్రెస్‌ రెండు సీట్లలో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. సీపీఐ, సీపీఎంతో పొత్తుతో ఆ పార్టీ 159 సీట్లలో బరిలోకి దిగింది. ఆ రెండు పార్టీలూ చెరో 8 చోట్ల పోటీచేశాయి. రాష్ట్రంలోని 25 లోక్‌సభ సీట్లకు గాను టీడీపీ కూటమికి భారీగా 21-23 రావచ్చని ‘ఇండియా టుడే- యాక్సిస్‌ మై ఇండియా’ శనివారం అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఎంపీ సీట్లతో పోలిస్తే కూటమికి అసెంబ్లీ సీట్లు కొంత తగ్గుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీపుల్స్‌ పల్స్‌ సంస్థ తన ఎగ్జిట్‌ పోల్‌లో ఈ రెండు పక్షాలకు వచ్చే ఓట్ల శాతం ఇంచుమించుగా ఇంతే ఉండవచ్చని.. కానీ టీడీపీ కూటమికి వచ్చే సీట్లు ఇంకా ఎక్కువ ఉంటాయని అంచనా వేసింది. ఆ సంస్థ అంచనా ప్రకారం.. టీడీపీ కూటమికి 52 శాతం ఓట్లు వస్తే వైసీపీకి 44 శాతం ఓట్లు వస్తాయి. దీని ప్రకారం టీడీపీ కూటమికి 111-135 మధ్యలో అసెంబ్లీ సీట్లు వస్తాయని, వైసీపీకి 45-60 సీట్లు వస్తాయి. ఎంపీ సీట్లు కూటమికి 17-21, వైసీపీకి 3-5 వస్తాయని తెలిపింది.

Updated Date - Jun 03 , 2024 | 03:57 AM