రంప మన్యంలో ఎయిర్ లిఫ్టింగ్
ABN , Publish Date - Apr 24 , 2024 | 03:30 AM
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం సెగ్మెంట్ పరిధిలోని నక్సల్స్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని, ఎన్నికల సామగ్రిని తరలించడం ఈసీకి ప్రతిసారీ సవాలే.
నక్సల్స్ సమస్యాత్మక ఏడు పోలింగ్ కేంద్రాలు
అక్కడికి సిబ్బంది తరలింపునకు హెలికాప్టర్లు
ఆర్మీ సాయంతో పోల్ నిర్వహణకు సన్నాహాలు
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం సెగ్మెంట్ పరిధిలోని నక్సల్స్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని, ఎన్నికల సామగ్రిని తరలించడం ఈసీకి ప్రతిసారీ సవాలే. దట్టమైన అటవీ ప్రాంతంలో, సాయంత్రం ఐదు దాటితే అంధకారంలోకి జారిపోయే ఈ ప్రాంతంలో పోలింగ్ నిర్వహణ కత్తి మీద సామే. ఈ పరిస్థితుల్లో అక్కడకు ఏటా మాదిరిగానే ఈసారీ ఎయిర్ లిఫ్టింగ్ చేపట్టాలని ఈసీ నిర్ణయించింది. అలాంటి పోలింగ్ కేంద్రాలు ఏడింటిని ఎన్నికల అధికారులు గుర్తించారు. అక్కడికి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి 14 ఈవీఎంలను, ఎన్నికల సిబ్బందిని తరలించేందుకు ఎన్నికల యంత్రాంగం ఒకటి నుంచి రెండు హెలికాప్టర్లను వినియోగించేందుకు వీలుగా ఏర్పాట్లుచేస్తున్నారు. వాటిని ఆర్మీ సమకూర్చనుంది. వై.రామవరం మండలం ఎగువ ప్రాంతంలోని గుర్తేడులోని 5, 7, 9, 10 నంబర్లు గల పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఇరవై ఆవాసాల్లోని 2,867 మంది ఓటర్ల కోసం, పాతకోటలోని 6వ నంబరు పోలింగ్ కేంద్రం పరిధిలోని నాలుగు ఆవాసాల్లోని 930 మంది ఓటర్ల కోసం, బొడ్డగండిలోని 8వ నంబరు పోలింగ్ కేంద్రం పరిధిలోని ఎనిమిది ఆవాసాల్లోని 647 మంది ఓటర్ల కోసం, ఇర్లవాడ (దారగడ్డ)లోని 11వ నంబరు పోలింగ్ కేంద్రం పరిధిలో ఐదు ఆవాసాల్లోని 1,101 మంది ఓటర్ల కోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మరీ సమస్యాత్మకంగా గుర్తించిన బొడ్డగండిలోని 8వ నెంబరు పోలింగ్ కేంద్రాన్ని ఏకంగా గుర్తేడుకు మారుస్తున్నారు. ఇక పాతకోట కేంద్రానికి ఈవీఎమ్లను, సిబ్బందిని గుర్తేడు నుంచి రోడ్డు మార్గాన తరలించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. రంపచోడవరం సబ్కలెక్టరు ప్రశాంతకుమార్ తాజాగా రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈసీ ప్రతిపాదనను పార్టీలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించాయి.
-రంపచోడవరం