Share News

మళ్లీ ‘అన్నదాత సుఖీభవ’

ABN , Publish Date - Jun 26 , 2024 | 02:27 AM

రాష్ట్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం మళ్లీ ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని అమలులోకి తెస్తోంది.

మళ్లీ ‘అన్నదాత సుఖీభవ’

రైతు భరోసా పేరు మార్పు.. ఏటా 20 వేల సాయం..త్వరలో విధి విధానాలు జారీ

అమరావతి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి):

ఇందుకోసం గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన రైతుభరోసా పేరును ‘అన్నదాత సుఖీభవ’గా మార్పు చేసింది. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏటా రూ.20వేలు అందిస్తామని టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ‘సూపర్‌సిక్స్‌’లో ప్రకటించారు. ఈ మేరకు ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద రాష్ట్ర ఖజానా నుంచి ఏటా రూ.14వేలు ఇచ్చి, కేంద్రం ఇచ్చే రూ.6వేలను కలుపుకొని అర్హత కలిగిన రైతులకు ఏటా రూ.20వేల చొప్పున అందించనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో విధి విధానాలతో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో గత ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా రైతులకు అమలు చేసిన మరికొన్ని పథకాల పేర్లు కూడా మార్చాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. ‘వైఎస్సార్‌ సున్నావడ్డీ పంట రుణాల’ పేరును ‘వడ్డీలేని రుణాలు’గా, ‘వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా’ను ‘ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన’గా మార్చారు.

Updated Date - Jun 26 , 2024 | 02:27 AM