అమరావతిలో అత్యాధునిక ఆసుపత్రి
ABN , Publish Date - Aug 14 , 2024 | 03:38 AM
విజయవాడలో ఆరు పడకలతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన రమేశ్ హాస్పిటల్స్ ప్రజల నమ్మకాన్ని చూరగొని దిగ్విజయంగా 36 ఏళ్లు పూర్తి చేసుకుందని ఆ సంస్థ అధినేత డాక్టర్ పోతినేని రమేశ్ బాబు పేర్కొన్నారు.
రమేశ్ హాస్పిటల్స్ 36వ వార్షికోత్సవంలో డాక్టర్ రమేశ్ వెల్లడి
విజయవాడ, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): విజయవాడలో ఆరు పడకలతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన రమేశ్ హాస్పిటల్స్ ప్రజల నమ్మకాన్ని చూరగొని దిగ్విజయంగా 36 ఏళ్లు పూర్తి చేసుకుందని ఆ సంస్థ అధినేత డాక్టర్ పోతినేని రమేశ్ బాబు పేర్కొన్నారు. విజయవాడలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘త్వరలో రాజధాని అమరావతిలో అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నాం. మేయో, క్లీవ్ ల్యాండ్ క్లినిక్ల స్ఫూర్తితో ఈ ఆసుపత్రి నిర్వహణ సాగుతుంది. అత్యున్నత స్థాయి వైద్యసేవలు, అత్యాధునిక వైద్య పరికరాలను ఈ ఆసుపత్రిలో అందుబాటులోకి తెస్తాం. రమేశ్ హాస్పిటల్స్ సుదీర్ఘ ప్రస్థానంలో 25 వేల గుండె శస్త్ర చికిత్సలు జరిగాయి. వైద్యరంగంలో టెలీ మెడిసిన్ వైద్య విధానాన్ని తీసుకొచ్చిన ఘనత రమేశ్ హాస్పిటల్స్ సొంతం. దీని ద్వారా లక్షలాది మంది రోగులకు సాంత్వన క లిగించాం. గత రెండు సంవత్సరాలుగా క్లౌడ్ డాక్స్ రమేశ్ పేరుతో టెలీ ఐసీయూ ప్రాజెక్టును తీసుకువచ్చాం. గుండెపోటుకు మొదటి గంట అమూల్యం అనే అవగాహన కార్యక్రమంతో మొదలుపెట్టి గుండెపోటు ముప్పును సీటీ యాంజీయోగ్రామ్ పరీక్ష ద్వారా ముందే కనుగొనటం, ఆధునిక వైద్య విధానాల్లో వైద్య చికిత్స అందించడం అనే ధృఢ సంకల్పంతో రమేశ్ హాస్పిటల్ ముందుకు వెళుతోంది. వైద్యరంగంలో అత్యున్నత వైద్య విధానాలతో సేవలందిస్తున్నందుకు అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అవార్డులను ప్రదానం చేశాయి. అత్యుత్తమ విజయాలను న మోదు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో రమేశ్ హాస్పిటల్ పేరు లిఖించాం. కోస్టల్ కారిడార్లో విజయవాడ, గుంటూరు, ఒంగోలులో 925 పడకలతో మల్టీ సూపర్ స్పెషాలిటి వైద్య సేవలను అందిస్తున్నాం’ అని డాక్టర్ రమేశ్ వివరించారు. సమావేశంలో రమేశ్ హాస్పిటల్స్ చైర్మన్ ఎంఎస్ రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.