వైసీపీ నేతల అధికార మదానికి నిదర్శనం
ABN , Publish Date - Mar 27 , 2024 | 02:26 AM
కాకినాడలో అర్చకులపై వైసీపీ నేత దాడి ఆ పార్టీ నేతల అధికార మదానికి నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.
![వైసీపీ నేతల అధికార మదానికి నిదర్శనం](https://media.andhrajyothy.com/media/2024/20240326/dd_ae03f01092.jpg)
అర్చకులపై దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, లోకేశ్
అమరావతి(ఆంధ్రజ్యోతి), మంగళగిరి, మార్చి 26: కాకినాడలో అర్చకులపై వైసీపీ నేత దాడి ఆ పార్టీ నేతల అధికార మదానికి నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘అర్చకుడు అంటే దేముడికి, భక్తుడికి మధ్య అనుసంధానకర్తగా భావించి కాళ్లకు మొక్కే సంప్రదాయం మనది. అటువంటి పూజారులను భక్తుల సమక్షంలోనే కాలితో తన్నడం, కొట్టడం హేయమైన రాక్షస చర్య. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. నిందితుడిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన ‘ఎక్స్’లో డిమాండ్ చేశారు. కాగా, ఇదే అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఓ ప్రకటన చేస్తూ... వైసీపీ నేత చంద్రరావు గర్భగుడిలో స్వైరవిహారం చేసి పూజారులపై దాడికి పాల్పడడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. భగవంతుడికి సేవ చేయడం తప్ప మరో ధ్యాసలేని అర్చకులపైనా ప్రతాపం చూపడం సిగ్గుచేటని విమర్శించారు. కాగా, అర్చకులు, బ్రాహ్మణులపై వైసీపీ నేతలు దాడిచేస్తే సహించేది లేదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. హిందూ మతాన్ని నాశనం చేయాలని జగన్రెడ్డి కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు.