ఒక ‘కిక్కు’ కథ!
ABN , Publish Date - Aug 25 , 2024 | 05:42 AM
ఎవరో వస్తారు! ‘కోడ్’ చెబుతారు! డబ్బు సంచి తీసుకెళ్లిపోతారు! ఇది మాఫియా స్టైల్! జగన్ హయాంలో మద్యం దందాలో కమీషన్ల వసూలు కూడా అచ్చం ఇలాగే సాగింది.
థ్రిల్లర్ స్టోరీ.. హవాలా దారి.. మాఫియా మాదిరి..
జగన్ హయాంలో నడిచిన ‘కమీషన్ చిత్రం’
ఒకసారి కనిపించిన వాడు మళ్లీ కనిపించడు! ప్రతిసారీ ‘వినిపించే’ వాడు ఎప్పుడూ కనిపించడు! మొత్తం చక్రం తిప్పే వ్యక్తి ఎప్పటికీ తెరవెనుకే ఉంటాడు! డబ్బు సంచులు మాత్రం మారుతూనే ఉంటాయి. చేరాల్సిన వాళ్లకు చేరుతూనే ఉంటాయి! ఇదీ.. వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు సాగిన ‘కమీషన్ల కిక్కు’ కథ! ఇందులో థ్రిల్లర్ సినిమాలకు మించిన సీన్లు! ‘మాఫియా’ను మించిన వ్యూహాలు! అటు మాఫియా, ఇటు హవాలా కలగలిపి సాగిన ఈ దందా మొత్తాన్ని ‘సైలెంట్’గా నడిపించిన వ్యక్తి పేరు... కసిరెడ్డి రాజశేఖర రెడ్డి!
తెర వెనుక సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి
ఆయన ఆధ్వర్యంలోనే మద్యం కమీషన్ల వసూలు
కంపెనీల ప్రతినిధులతో ‘ప్రకాశ్ కాలింగ్’
విదేశీ సిమ్లతోనే మొత్తం మంత్రాంగం
ప్లేస్, టైమ్ ఫిక్స్ చేసి నగదు మార్పిడి
ఎవరో వస్తారు.. తీసుకుని వెళ్తారు
అంతిమంగా చేరింది నాటి సర్కారు పెద్దలకే!
ఐదేళ్లలో 3 వేల కోట్లకుపైగా కలెక్షన్
మధ్యలో కసిరెడ్డి సొంత బ్రాండ్ల అమ్మకం
నాలుగేళ్లలో 1.25 కోట్ల కేసుల ఆర్డర్లు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఎవరో వస్తారు! ‘కోడ్’ చెబుతారు! డబ్బు సంచి తీసుకెళ్లిపోతారు! ఇది మాఫియా స్టైల్! జగన్ హయాంలో మద్యం దందాలో కమీషన్ల వసూలు కూడా అచ్చం ఇలాగే సాగింది. గత ఐదేళ్లలో మద్యంపై వసూలు చేసిన కమీషన్లు రూ.3,113 కోట్లు. ఇంత భారీ స్థాయిలో ముడుపులు వసూలు చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. అసలు ఇన్ని వేల కోట్లు ఎలా వసూలు చేశారు? ఎవరికీ దొరక్కుండా ఇంత డబ్బు ఎలా చేతులు మారింది? మూడో కంట పడకుండా వేల కోట్లు వసూలు చేయించింది ఎవరు? మద్యం కంపెనీల వర్గాలు చెబుతున్న పేరు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. ఏ కంపెనీకి ఆర్డర్లు ఇవ్వాలి? షాపుల్లో ఏ బ్రాండ్లు అమ్మాలి? అనేది అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి నిర్ణయిస్తే... ఆర్డర్లు పొందిన కంపెనీల నుంచి కమీషన్లు వసూలు చేసింది మాత్రం కసిరెడ్డే. తెరముందు వాసుదేవ రెడ్డి చక్రం తిప్పితే, తెరవెనుక వేల కోట్ల నగదును నాటి సర్కారు పెద్దల శిబిరానికి చేర్చిన ఘనుడు కసిరెడ్డి. విచిత్రం ఏంటంటే ఇంత చేసినా ఆయన ముఖం కూడా చాలా కంపెనీల ప్రతినిధులకు తెలియదు. ‘కమీషన్ సొమ్ము ఫలానా చోటికి పంపండి’ అని ప్రకాశ్ అనే వ్యక్తి నుంచి వాళ్లకు ఫోన్ వస్తుంది. ఈ ‘ప్రకాశ్’ ఎవరు, ఎలా ఉంటారో కూడా వారికి తెలియదు. ప్రతిసారీ కొత్త వ్యక్తులు వచ్చి డబ్బు సంచులు తీసుకెళతారు. ఇంత పక్కాగా మొత్తం దందా నడిపించారు. ఐదేళ్ల కాలంలో రూ.3వేల కోట్లకుపైగా నగదు వసూలు చేసిన వారిని ఎవరూ గుర్తించలేకపోయారు.
అటు ఇచ్చి... ఇటు వసూలు
వైసీపీ ప్రభుత్వంలో 2020 జనవరి నుంచి కమీషన్ల వ్యవహారం ప్రారంభమైంది. మద్యం ఉత్పత్తి చేసే కంపెనీలు వారి మద్యాన్ని ఏపీలో అమ్మాలంటే ఒక కేసు లిక్కర్కు రూ.200, బీరుకు రూ.50 కప్పం కట్టాలి. అయితే అదేం కంపెనీల సొంత డబ్బు కాదు. వారు ఎంత కమీషన్ చెల్లిస్తున్నారో, అంత మొత్తాన్ని ఇవ్వాల్సిన దానికంటే అదనంగా ప్రభుత్వం ఆ కంపెనీలకు చెల్లిస్తుంది. ఉదాహరణకు ఒక బ్రాండ్ కేసు విలువ రూ.వెయ్యి అనుకుంటే ప్రభుత్వం ఆ కంపెనీకి రూ.1200 చెల్లిస్తుంది. అదనంగా వచ్చిన రూ.200 కసిరెడ్డికి చేరతాయి. ఇలా ఐదేళ్లలో రూ.3,113 కోట్లు వైసీపీ పెద్దలకు వెళ్లాయి.
ప్రకాశ్ కాలింగ్....
మద్యం కంపెనీల నుంచి చేసిన వసూళ్లకు కేంద్ర బిందువు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఇదంతా హవాలా రూపంలో జరిగింది. ఒక కంపెనీకి ప్రభుత్వం నుంచి బిల్లులు విడుదలైన వెంటనే ఆ కంపెనీ ప్రతినిధులకు ‘ప్రకాశ్’ అనే వ్యక్తి నుంచి ఫోన్ వెళ్తుంది. అమెరికా, న్యూజిలాండ్, ఆఫ్రికా దేశాల ఫోన్ నంబర్ల నుంచి ఈ ఇంటర్నెట్ కాల్స్ వస్తాయి. ఏ నంబరు నుంచి వచ్చినా ప్రకాశ్ ఒక్కడే మాట్లాడతాడు. ఫలానా రోజు, ఫలానా చోటకు రావాలని ఫోన్లో చెబుతాడు. అయితే ప్రతిసారీ డబ్బులు తీసుకోవడానికి వెళ్లే మనుషులు మారిపోతారు. అసలు వారెవరో కంపెనీల ప్రతినిధులకు తెలియదు.
‘కోడ్’ ప్లేస్...
పోస్టాఫీసు, సూపర్ మార్కెట్, మెట్రో పిల్లర్ నంబరు ఇలా ఏదో ఒక లొకేషన్ చెబుతారు. ఫలానా సమయానికి క్యాష్ బ్యాగ్తో అక్కడ ఉండాలని చెబుతారు. కంపెనీ ప్రతినిధులు తమ వ్యక్తి ద్వారా నగదు పంపిస్తారు. అక్కడ రెడీగా ఉండే ‘కసిరెడ్డి’ మనుషులకు క్యాష్ ఇచ్చేసి వెళ్లిపోతారు. అదికూడా... సరైన వ్యక్తులకు వెళుతోందని ‘కోడ్’తో నిర్ధారించుకున్నాకే! అసలు వచ్చిన వ్యక్తి ఎవరు? అతని పేరేంటి? అనే వివరాలు ఉండవు. కంపెనీ ప్రతినిధులు ప్రతినెలా కమీషన్లు ఇచ్చినా ప్రతిసారీ కొత్త వ్యక్తులకే డబ్బులు అందజేస్తారు.
సొంత బ్రాండ్లకు అప్పనంగా..
బయటి కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేసిన కసిరెడ్డి.. పనిలోపనిగా సొంత బ్రాండ్ల విక్రయాలు భారీగా చేసుకున్నారు. వివిధ రకాల పేర్లతో నాలుగు రకాల బ్రాండ్లను కొత్తగా మార్కెట్లోకి తెచ్చారు. వీటిలోనూ కసిరెడ్డితో పాటు వైసీపీ పెద్దల పాత్ర కూడా ఉందనే ప్రచారం ఉంది. అదాన్ డిస్టిలరీకి చెందిన అదాన్స్ సుప్రీం బ్లెండ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ బ్రాండ్కు నాలుగేళ్లలో 40,52,530 కేసుల ఆర్డర్ ఇచ్చారు. లీలా డిస్టిలరీకి చెందిన లీలాస్ బ్రిలియంట్ బ్లెండ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీకి 24,28,546, ఎస్పీవై ఆగ్రోలో తయారుచేసిన దారు హౌస్ ఎక్స్వో బ్రాందీకి 48,15,040, రాయల్ సింహా సుపీరియర్ విస్కీకి 10,04,924 కేసుల మేర ఆర్డర్లు ఇచ్చారు. మొత్తంగా నాలుగేళ్లలో 1.25 కోట్ల కేసుల ఆర్డర్లు ఇచ్చారు. విచిత్రం ఏంటంటే 2019కు ముందు ఈ బ్రాండ్లు రాష్ట్రంలో లేవు. అసలు ఎప్పుడు ప్రారంభించారో కూడా తెలియదు. ఈ బ్రాండ్లనే ప్రభుత్వ మద్యం షాపుల్లో ఎక్కువగా అమ్మించి భారీగా ఆర్జించారు. అదే సమయంలో పాపులర్ బ్రాండ్లకు వేల సంఖ్యలోనే ఆర్డర్లతో సరిపెట్టారు.
ఆ బ్రాండ్లకు లక్షల సంఖ్యలో ఆర్డర్లు అందుకే..
వైసీపీ ప్రభుత్వం రాకముందు ఒక్క కేసు కూడా అమ్మని బ్రాండ్లకు ఇలా లక్షల సంఖ్యలో ఆర్డర్లు ఎందుకు ఇచ్చారు? అంటే కమీషన్ల కోసమేనని ఎవరికైనా అర్థమవుతుంది. పైగా లిక్కర్తో పాటు బ్రిటిష్ ఎంపైర్ గ్రాండ్ ప్రీమియం, బీరా 91 బూమ్, బ్లాక్ బాస్టర్ అనే బీరు బ్రాండ్లకు కూడా పెద్దఎత్తున ఆర్డర్లు ఇచ్చి వాటినే మద్యం షాపుల్లో అమ్మించారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో 38 లిక్కర్ బ్రాండ్లు, 7 బీరు బ్రాండ్లు కొత్తగా రాష్ట్రంలోకి తీసుకొచ్చారు. వీటిని ఉత్పత్తి చేయించేందుకు రాష్ట్రంలోని ప్రముఖ డిస్టిలరీల యాజమాన్యాలను బెదిరించి వాటిని లాక్కున్నారు. విశాఖ, పీఎంకే, పెరల్, ఎస్వీఆర్, ఎస్పీవై ఆగ్రో లాంటి డిస్టిలరీలను పూర్తిగా చేతుల్లోకి తీసుకున్నారు.