వైద్యుడు రాసిన మరణ శాసనం
ABN , Publish Date - May 01 , 2024 | 05:00 AM
అప్పుల బాధలు, ఆసుపత్రి నిర్వహణలో భాగస్వాముల మధ్య విభేదాలతో ఓ వైద్యుడు దారుణానికి ఒడిగట్టాడు. జన్మనిచ్చిన తల్లిని, కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను కిరాతకంగా చంపేశాడు. తర్వాత తాను ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తల్లి సహా భార్యాపిల్లల హత్య
అనంతరం ఉరేసుకుని ఆత్మహత్య
బెజవాడలో దారుణం
అప్పులు, ఆస్పత్రి నిర్వహణలో
భాగస్వాములతో విభేదాలని ప్రచారం
వైద్యుడి మరణ శాసనం
విజయవాడ, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): అప్పుల బాధలు, ఆసుపత్రి నిర్వహణలో భాగస్వాముల మధ్య విభేదాలతో ఓ వైద్యుడు దారుణానికి ఒడిగట్టాడు. జన్మనిచ్చిన తల్లిని, కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను కిరాతకంగా చంపేశాడు. తర్వాత తాను ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం విజయవాడలో కలకలం రేపింది. నగరంలోని పటమట ఫన్టైమ్స్ క్లబ్ వెనుక వీధిలో ఉంటున్న డాక్టర్ దారావత్ శ్రీనివాస నాయక్ (45) ఆర్థోపెడిక్ వైద్యుడు. ఆయన భార్య ఉషారాణి గృహిణి. వారికి కుమార్తె శైలజ(9), కుమారుడు శ్రీహాన్(5) ఉన్నారు. శ్రీనివాస నాయక్ తల్లి రమణమ్మ(65) వారితోనే ఉంటుంది. ఏడాది క్రితం శ్రీనివాస నాయక్ విజయవాడ డోర్నకల్ రోడ్డులో శ్రీజ ఆర్థోపెడిక్ ఆసుపత్రి ఏర్పాటుచేశారు. దీనిపై ఆదాయం రాకపోగా ఎదురు పెట్టుబడి పెట్టాల్సి రావడంతో ముగ్గురు వైద్యులను భాగస్వాములుగా చేర్చుకున్నారు. ఆసుపత్రి కోసం చేసిన అప్పులు పెరిగిపోవడం, భాగస్వాములుగా చేరిన వారు మొత్తం పెత్తనం లాక్కోవడంతో ఆయన తీవ్ర మనోవేదనకు లోనయ్యారని తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున మొదటి గదిలో నిద్రపోతున్న భార్య, కుమార్తెను, ఆ తర్వాత రెండో గదిలో ఉన్న తల్లిని, అనంతరం మూడో గదిలో ఉన్న కుమారుడు శ్రీహాన్ను మెడకోసి శ్రీనివాస నాయక్ హత్య చేశారు. ఆ తర్వాత ఉదయం ఆరు గంటల వరకు ఆయన మేల్కొని ఉన్నారు. హైదరాబాద్లో న్యాయాధికారిగా పనిచేస్తున్న సోదరుడు దుర్గాప్రసాద్కు ఒక లేఖ రాశారు. ఈ లేఖతో పాటు తన కారు తాళాలను తీసుకుని ఎదురింటికి వెళ్లిన శ్రీనివాస నాయక్ ఆ గేటుకు ఉన్న ఉత్తరాల పెట్టెలో వేశారు. తర్వాత ఇంటికి వచ్చి ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం పది గంటల సమయంలో పనిమనిషి చూడగా వరండాలో డాక్టర్ ఉరికి వేలాడుతూ కనిపించారు. ఆమె ఇరుగుపొరుగు వారికి, వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన సోదరుడు హైదరాబాద్ నుంచి వచ్చాక కారు తలుపులు తెరవగా అందులో ఒక బ్యాగ్ లో నగదు, బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్ ఉన్నాయి.