Share News

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు

ABN , Publish Date - Apr 17 , 2024 | 03:25 AM

బంధుమిత్రులతో కలిసి శ్రీరామనవమిని ఆనందంగా జరుపుకొనేందుకు ఆ కుటుంబం స్వగ్రామానికి చేరుకుంది. పూజాసామగ్రి కొనుగోలుకు బయలుదేరిన వారిని లారీ రూపంలో మృత్యువు కబళించింది.

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

కావలి, ఏప్రిల్‌ 16: బంధుమిత్రులతో కలిసి శ్రీరామనవమిని ఆనందంగా జరుపుకొనేందుకు ఆ కుటుంబం స్వగ్రామానికి చేరుకుంది. పూజాసామగ్రి కొనుగోలుకు బయలుదేరిన వారిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దావులూరి శ్రీనివాసులు (50), దావులూరి వరమ్మ (45), దావులూరి లక్ష్మమ్మ (52), గంటా నీలిమ (24), గంటా గౌసిక్‌నంద్‌ (3) అక్కడికక్కడే మృతి చెందారు. జలదంకి మండలం చామదలకు చెందిన శ్రీనివాసులు 25 ఏళ్ల క్రితం హైదరాబాదుకు వెళ్లి బిల్డర్‌గా స్థిరపడ్డారు. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా స్వగ్రామంలో జరిగే తిరునాళ్ల కోసం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి కారులో సోమవారం బయలుదేరి మంగళవారం ఉదయానికి చామదల చేరుకున్నారు. తిరునాళ్లలో శ్రీరాముడి కల్యాణం కోసం పూజా సామగ్రిని తీసుకువచ్చేందుకు అదే కారులో శ్రీనివాసులుతోపాటు ఆయన భర్య వరమ్మ, కుమార్తె నీలిమ, మనుమడు గౌసిక్‌ నంద్‌, వదిన లక్ష్మమ్మ కావలికి బయలుదేరారు. బిట్రగుంట మీదుగా కావలికి వస్తూ చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను వెలుపలకు తీసి, కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు.

Updated Date - Apr 17 , 2024 | 03:25 AM