62,571 మంది వలంటీర్లు రాజీనామా
ABN , Publish Date - Apr 25 , 2024 | 03:55 AM
ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేసిన అనంతరం రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 22 వరకు 62,571 మంది వలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) హైకోర్టుకు నివేదించింది.
హైకోర్టుకు నివేదించిన కేంద్ర ఎన్నికల సంఘం
అమరావతి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేసిన అనంతరం రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 22 వరకు 62,571 మంది వలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) హైకోర్టుకు నివేదించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకుగాను 929 మందిని ఉద్యోగాల నుంచి తొలగించామని సీఈసీ తరఫున సీనియర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలకు కారణాలు తెలియవని చెప్పారు. వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు. గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగులను మాత్రమే ఎన్నికల విధులకు అనుమతిస్తున్నామన్నారు. పిటిషనర్ కోరిన విధంగా ఎన్నికలు ముగిసేవరకు వలంటీర్లు రాజీనామాలు ఆమోదించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి తాము ఆదేశాలివ్వలేమన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. ఎన్నికలు ముగిసేవరకు గ్రామ-వార్డు వలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా సీఎస్, పురపాలకశాఖ కమిషనర్, సచివాలయశాఖ ముఖ్యకార్యదర్శికి సూచించేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య యువజనపార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్చంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సుమన్ వాదనలు వినిపించారు.