ఆంధ్రప్రదేశ్కు కొత్తగా 6 వైద్య కళాశాలలు
ABN , Publish Date - Jul 07 , 2024 | 03:13 AM
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 6 వైద్య కళాశాలలు రాబోతున్నాయి. ఇందులో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే 3 కళాశాలలు రానున్నాయి.
దేశవ్యాప్తంగా 113 కళాశాలలకు దరఖాస్తులు
ఎన్ఎంసీ జాబితా విడుదల
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 6 వైద్య కళాశాలలు రాబోతున్నాయి. ఇందులో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే 3 కళాశాలలు రానున్నాయి. పాడేరు, మదనపల్లి, ఆదోనిలలో ప్రభుత్వ వైద్య కళాశాలలకు, చిత్తూరులోని తిరుపతిలో అన్నాగౌరి వైద్య కళాశాల, పులివెందులలో వైయస్సార్ వైద్య కళాశాల, చిత్తూరులోనే ఆర్వీఎస్ కళాశాల కోసం దరఖాస్తులు వచ్చినట్లు జాతీయ వైద్య కమిషన్ తెలిపింది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో కొత్తగా 11 వైద్య కళాశాలలు రాబోతున్నాయి. ఇందులో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే 8 కళాశాలలు రానున్నాయి. గద్వాల, మెదక్, ములుగు, మహేశ్వరం, నర్సంపేట, కుత్భుల్లాపూర్, యాదాద్రి భువనగిరి, నారాయణపేటలో ప్రభుత్వ వైద్య కళాశాలల కోసం దరఖాస్తులు వచ్చినట్లు జాతీయ వైద్య కమిషన్ వెల్లడించింది. ప్రైవేటులో నిజామాబాద్ నుంచి సిస్ట క్రిస్టియన్ వైద్య కళాశాల, రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్మెట్ మండలం జాఫర్ఘడ్లో నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సంగారెడ్డి జిల్లా పఠాన్చెరువు సమీపంలోని చిట్కుల్లో రాజరాజేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం 113 వైద్య కళాశాలలను కొత్తగా ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు వచ్చినట్లు ఎన్ఎంసీ పేర్కొంది.