జగన్ విధ్వంసంతో 30ఏళ్లు వెనక్కి
ABN , Publish Date - Apr 24 , 2024 | 03:11 AM
జగన్ అయిదేళ్ల అస్తవ్యస్త పాలనతో గాడి తప్పిన రాష్ట్ర భవిష్యత్తును విజనరీ లీడర్ చంద్రబాబు తిరిగి గాడిలో పెడతారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు.
ఆయనకు మరో చాన్స్ ఇస్తే అంధకారమే
చంద్రబాబుతోనే రాష్ట్రం తిరిగి గాడిలోకి: లోకేశ్
మంగళగిరి, ఏప్రిల్ 23: జగన్ అయిదేళ్ల అస్తవ్యస్త పాలనతో గాడి తప్పిన రాష్ట్ర భవిష్యత్తును విజనరీ లీడర్ చంద్రబాబు తిరిగి గాడిలో పెడతారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న కొండపనేని టౌన్షిప్ వాసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ విధ్వంసక విధానాల కారణంగా రాష్ట్రం 30ఏళ్ల పాటు వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి రాజధాని ఏదో కూడా చెప్పుకోలేని దుస్థితికి జగన్ దిగజార్చారని మండిపడ్డారు. ఈ దీనస్థితి నుంచి ఏపీని గట్టెక్కించడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమనే విషయాన్ని ప్రజలందరూ ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారని తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారని ఆరోపించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని ప్రక్షాళన చేసి పేదలకు మెరుగైన వైద్యాన్ని అందజేస్తామని లోకేశ్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో జగన్ మరోమారు అధికారంలోకి వస్తే అంధకారం రాజ్యమేలుతుందని హెచ్చరించారు. చేనేత కేంద్రమైన మంగళగిరిలో మగ్గాల సంఖ్యను 5వేలకు పెంచి ఈ ప్రాంతానికి గత వైభవాన్ని కచ్చితంగా తీసుకొస్తామని తెలిపారు.