ఓటేయడానికి 2,800 కి.మీ. దూరం నుంచి వచ్చాం
ABN , Publish Date - May 12 , 2024 | 04:04 AM
‘ఏపీ తలరాతను మార్చే ఓటుహక్కు ను వినియోగించుకోడం కోసం 2,800కి.మీ. దూరం నుంచి వచ్చాం.

షార్జా నుంచి తరలివచ్చిన ఎన్ఆర్ఐలు
విజయవాడ/ గన్నవరం, మే 11 (ఆంధ్రజ్యోతి): ‘‘ఏపీ తలరాతను మార్చే ఓటుహక్కు ను వినియోగించుకోడం కోసం 2,800కి.మీ. దూరం నుంచి వచ్చాం. మరి రాష్ట్రంలోనే ఉండే మీరు పోలింగ్ కేంద్రాలకు కదలకపోతే ఎలా?’’ అంటూ రాష్ట్ర ప్రజలను ప్రవాసులు అప్రమత్తం చేశారు. ఈసారి తమ ఓటు అత్యవసరం అని భావించి దూరం, వ్యయం చూడకుండా వచ్చామన్నారు. ‘‘అందరం ఓటేసి ఏపీ తలరాత మార్చుదాం... ఆంధ్రులంటే అభివృద్ధి కాముకులనే మంచిపేరును నిలబెడదాం’’ అని విజ్ఞప్తి చేశారు. శనివారం షార్జా నుంచి విజయవాడ విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐలు వచ్చారు. దుబాయ్, షార్జా, అబుదాబిలో పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఉద్యోగులు షార్జా-విజయవాడ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఉదయం 8.30 గంటలకు ఇక్కడకు చేరుకున్నారు. ఎన్నో పనులు, సమావేశాలు, ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ ఓటు హక్కు వినియోగించుకోవటానికి వచ్చారు. మహిళలు కూడా గణనీయంగా వచ్చారు. మేజర్ సర్జరీలు చేయించుకుని ఇటీవలే కుట్లు తీయించుకున్నవారు కూడా ఆరోగ్యం సహకరించకున్నా ఓటుకు విలువ ఇచ్చి వచ్చారు. దుబాయ్లో కార్మికులుగా ఉపాధి పొందటానికి వెళ్లినవారు సైతం తరలివచ్చారు. ఏపీని అభివృద్ధి పథంలో చూడాలన్న కాంక్షతో ఓటు వేయటానికి వచ్చామంటూ భావోద్వేగానికి గురయ్యారు. విమానాశ్రయంలో దిగిన వారిని ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది. ‘అభివృద్ధిలో వెనుకబడిన ఏపీని చూస్తే బాధేస్తోంది. అందరం కలిసి రాష్ట్ర తలరాతను మార్చే సమయం ఇప్పుడు వచ్చింది. జన్మభూమిపై అభిమానంతో, బాధ్యతతో ఓటేయటానికి వచ్చాం’ అని ముక్తకంఠంతో స్పష్టం చేశారు.