Share News

AP News: అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ, జనసేన కూటమి

ABN , Publish Date - Feb 01 , 2024 | 04:01 AM

రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు గాను 13 చోట్ల టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది. బయటకు అధికారికంగా ప్రకటించకపోయినా అంతర్గతంగా వారి అభ్యర్థిత్వాలపై ఆ పార్టీల్లో స్పష్టత వచ్చినట్లు సమాచారం.

AP News: అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ, జనసేన  కూటమి

అభ్యర్థులను నిర్ణయించిన టీడీపీ, సేన.. 11చోట్ల తెలుగుదేశం పోటీ

శ్రీకాకుళంలో రామ్మోహన్‌, విశాఖలో భరత్‌, నరసాపురంలో రఘురామ

తిరుపతి-నీహారిక.. బెజవాడ-కేశినేని చిన్ని, జనసేన ఖాతాలో కాకినాడ, బందరు

ముగ్గురు వైసీపీ సిటింగ్‌లకు అవకాశం.. మిగిలిన సీట్లపై కొనసాగుతున్న కసరత్తు

మారుతున్న సమీకరణలతో నెల్లూరు, ఒంగోలు పెండింగ్‌.. కడపపైనా తర్వాత నిర్ణయం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు గాను 13 చోట్ల టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది. బయటకు అధికారికంగా ప్రకటించకపోయినా అంతర్గతంగా వారి అభ్యర్థిత్వాలపై ఆ పార్టీల్లో స్పష్టత వచ్చినట్లు సమాచారం. మిగిలిన స్థానాలపై కసరత్తు నడుస్తోంది. వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకుని 2-3 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయకుండా పెండింగ్‌లో ఉంచారు. అధికార పార్టీ వైసీపీ నుంచి బయటకు వచ్చిన ముగ్గురు సిటింగ్‌ ఎంపీలకు.. టీడీపీ తరఫున రఘురామకృష్ణంరాజు(నరసాపురం), లావు శ్రీకృష్ణదేవరాయలు (నరసరావుపేట).. వల్లభనేని బాలశౌరి (మచిలీపట్నం)కి టికెట్లు లభించనున్నాయి. మరో వైసీపీ ఎంపీకి కూడా టీడీపీ టికెట్‌ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. 25 లోక్‌సభ స్థానాల్లో జనసేనకు ఎన్ని ఇస్తారో నిర్దిష్టంగా తేలకపోయినా.. ఇప్పటికి 13 సీట్లలో మచిలీపట్నం, కాకినాడ సీట్లు ఆ పార్టీకి దక్కాయి. శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం, అమలాపురం, నరసాపురం, ఏలూరు, విజయవాడ, నరసరావుపేట, తిరుపతి(ఎస్సీ), రాజంపేట, అనంతపురం, హిందూపురంలో టీడీపీ బరిలో ఉండనుంది.

టీడీపీలో అధిక ఆశావహులు

మిగిలిన సీట్లలో అభ్యర్థులపై పరిశీలన కొనసాగుతోంది. విజయనగరం ఎంపీ సీటుకు వెంకటేశ్‌, కంది చంద్రశేఖర్‌ తదితరులు పోటీలో ఉన్నారు. అరకు (ఎస్టీ) స్థానంపై కసరత్తు మొదలు కాలేదు. రాజమహేంద్రవరం సీటుకు మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు పేరు ముందంజలో ఉంది. ఆయన కాని పక్షంలో బొడ్డు వెంకటరమణ, గన్ని కృష్ణ, శిష్ట్లా లోహిత్‌ పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. అమలాపురానికి మాజీ స్పీకర్‌ బాలయోగి కుమారుడు గంటి హరీశ్‌ పేరు ఖరారైనా.. తాజాగా మాజీ ఎంపీ బుచ్చిమహేశ్వరరావు కుమార్తె తనకు ఆసక్తి ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. గుంటూరుకు ప్రవాసాంధ్రుడు పెమ్మసాని చంద్రశేఖర్‌ పేరు గతంలోనే ఖరారైంది. కానీ ఎన్నారైలకు ఇవ్వడంపై పార్టీలో ప్రతికూల చర్చ ప్రారంభం కావడంతో ప్రత్యామ్నాయంగా భాష్యం రామకృష్ణ పేరు పరిశీలనకు వస్తోంది. బాపట్ల (ఎస్సీ) స్థానానికి కనీసం అర డజను పేర్లు పరిశీలనలో ఉన్నాయి. హరిప్రసాద్‌, ఉండవల్లి శ్రీదేవి, పనబాక లక్ష్మి, పాలపర్తి మనోజ్‌కుమార్‌, ఎంఎస్‌ రాజు తదితరులు పోటీలో ఉన్నారు. మరి కొన్ని పేర్లను కూడా ఆ పార్టీ నాయకత్వం క్షేత్ర స్థాయి పరిశీలనకు పంపింది.

ఒంగోలు, నెల్లూరు అభ్యర్థులపై కసరత్తును ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచింది. ఇక్కడ అసెంబ్లీ స్థానాల్లో కొన్ని మార్పుచేర్పులు జరిగే అవకాశం ఉన్నందున వీటి విషయం తర్వాత ఆలోచించాలని నిర్ణయించింది. చిత్తూరు(ఎస్సీ) స్థానానికి తలారి ఆదిత్య, యశ్వంత్‌, హరిప్రసాద్‌, సినీ నటుడు సప్తగిరి, కోనేరు ఆదిమూలం తదితర పేర్లు వినిపిస్తున్నాయి. అనంతపురంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేరును ఖరారు చేసినా.. తాజాగా పూల నాగరాజు, అంబిక లక్ష్మీనారాయణ, బండి శ్రీకాంత్‌ పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కడపలో పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసులరెడ్డి, బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు రితేశ్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక్కడా చివరి వరకూ నిర్ణయం జరిగే అవకాశం లేదని చెబుతున్నారు. కర్నూలులో బస్తీ నాగరాజు, డాక్టర్‌ పార్థసారథి.. నంద్యాలలో సీనియర్‌ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె శబరి, విద్యా సంస్థల యజమాని కేవీ సుబ్బారెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. శబరికి అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వినవస్తోంది.

Updated Date - Feb 01 , 2024 | 07:42 AM