11వ రోజు ‘మున్సిపల్’ సమ్మె
ABN , Publish Date - Jan 06 , 2024 | 02:32 AM
మున్సిపల్ పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె 11వ రోజు శుక్రవారం కొనసాగింది. సీఐటీయూ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనంతపురం నగరపాలిక ఎదుట మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షుడు బండారు ఎర్రిస్వామి అరగుండు,
![11వ రోజు ‘మున్సిపల్’ సమ్మె](https://media.andhrajyothy.com/media/2023/20231205/dfkbv_534b142018.jpg)
అనంతలో అరగుండు, అరమీసంతో నిరసన
పలుచోట్ల నడిరోడ్డుపై పొర్లుదండాలు
ఏలూరులో మున్సిపల్ కార్మికుల అరెస్టు
అనంతపురం క్రైం, జనవరి 5: మున్సిపల్ పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె 11వ రోజు శుక్రవారం కొనసాగింది. సీఐటీయూ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనంతపురం నగరపాలిక ఎదుట మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షుడు బండారు ఎర్రిస్వామి అరగుండు, అరమీసంతో నిరసన తెలిపారు. కార్మికులు నగరంలో ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. నగరపాలిక ఎదుట నడిరోడ్డుపై పొర్లుదండాలు పెట్టారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నడిరోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. నంద్యాలలో కార్మికులు పొర్లుదండాలు పెడుతూ సీఎం జగన్కు మంచి బుద్ధి ప్రసాదించాలి స్వామీ అంటూ భగవంతుడిని వేడుకున్నారు. విజయవాడ లెనిన్ సెంటర్లో, శ్రీకాకుళం, కడప జిల్లా బద్వేలులో మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు పొర్లుదండాలు పెట్టారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహం ఎదుట గుండు కొట్టించుకుని నిరసన వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మున్సిపల్ కార్మికులు వంటావార్పుతో నిరసన తెలిపారు. ఏలూరులో ప్రైవేటు పనివారితో పారిశుధ్య పనులు చేయించడానికి అధికారులు క్లాప్ వాహనాలను బయటకు తీస్తుండగా సమ్మె చేస్తున్న కార్మికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసు బలగాలు కార్మికులను ఈడ్చిపడేశాయి. మహిళా కార్మికులను మగ పోలీసులు రోడ్లపై ఈడ్చుకెళ్ళి వ్యాన్ ఎక్కించి ఏలూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మిగిలిన కార్మికులంతా పోలీ్సస్టేషన్ను ముట్టడించడంతో సాయంత్రం వదిలివేశారు.